ఐపీఎల్ 2025 సీజన్ రీస్టార్ట్కు వర్షం అడ్డంకిగా మారింది. భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా వారం పాటు వాయిదా పడిన ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభమయ్యేందుకు సిద్దమైంది. ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించింది. ఈ షెడ్యూల్లో భాగంగా ఆర్సీబీ, కేకేఆర్తో శనివారం బెంగళూరు వేదికగా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుండటంతో టాస్ కూడా వేయలేదు. కుండపోతగా వర్షం కురుస్తుండటంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐపీఎల్ 2025 సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యాయి. నాలుగు ప్లే ఆఫ్స్ స్థానాల కోసం ఏడు జట్లు పోటీ పడుతుండటంతో టోర్నీ ఆసక్తికరంగా మారింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతీ జట్టు తమ తదుపరి మ్యాచ్ల్లో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ కీలక మ్యాచ్లకు ముందు వరణుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలను వణికిస్తున్నాడు.

ఒక్క మ్యాచ్ రద్దయినా..
ముఖ్యంగా ముంబై ఇండియన్స్.. తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్ రద్దయినా ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ల్లో 7 విజయాలతో 14 పాయింట్స్తో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. తమ చివరి రెండు మ్యాచ్లకు రెండు గెలిస్తేనే 18 పాయింట్స్తో ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఒక్క మ్యాచ్ ఓడినా.. రద్దయినా పరిస్థితి సంక్లిష్టంగా మారుతోంది. రెండు ఓడితే మాత్రం ఇంటిదారి పడుతోంది.
రెండు ఓడితే అంతే..
ప్రస్తుతం టాప్-3లో ఉన్న గుజరాత్ టైటానస్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్కు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాలుగో స్థానం కోసం ముంబై, ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య పోటీ నెలకొంది. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్తో ఆడనుంది. మే21న వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో తలపడనున్న ముంబై ఇండియన్స్.. మే 26న పంజాబ్ కింగ్స్తో జైపూర్ వేదికగా ఆడనుంది. ఈ రెండు మ్యాచ్లు ఓడితే ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకుంటుంది.
ఒకటి గెలిచి.. మరొకటి ఓడినా..
ఒక మ్యాచ్ గెలిస్తే మాత్రం 16 పాయింట్స్తో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒక మ్యాచ్ రద్దయి.. మరో మ్యాచ్ ఓడితే 15 పాయింట్లతో నిలుస్తోంది. అప్పుడు ఇతర జట్ల ఫలితాలు, రన్రేట్ కీలకమవుతోంది. రెండు మ్యాచ్లు రద్దయినా.. 16 పాయింట్స్తో ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రన్రేట్నే కొనసాగిస్తే టోర్నీలో ముందడుగు వేస్తోంది.