ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ ఔటైనా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్... వాషింగ్టన్ సుందర్తో కలిసి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో ఈ ఇద్దరూ బౌండరీల మోత మోగించారు.
సూరీడు ఇంజ్యూరీ డ్రామా..?
ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు ముంబై ఆటగాళ్లు వణికిపోయారు. వాషింగ్టన్ సుందర్ కొట్టిన వరుస సిక్స్లకు డగౌట్లోని రోహిత్ శర్మ నెత్తిని పట్టుకున్నాడు. ఈ ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు గుజరాత్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ హైడ్రామా ఆడాడు. సాయి సుదర్శన్-వాషింగ్టన్ సుందర్ ఏకాగ్రతను దెబ్బతీసేలా గాయం డ్రామా ఆడాడు. దాంతో ఫిజియోలు మైదానంలోకి వచ్చి అతనికి చికిత్స ఇవ్వడంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.

ఆ సమయంలోనే డ్రెస్సింగ్ రూమ్ నుంచి రావాల్సిన మేసేజ్ ముంబై ఇండియన్స్కు అందింది. ఆ వెంటనే బంతిని అందుకున్న బుమ్రా.. దూకుడుగా ఆడుతున్న వాషింగ్టన్ సుందర్ను స్టన్నింగ్ యార్కర్తో క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే సాయి సుదర్శన్ కూడా ఔటవ్వడంతో ముంబై విజయం లాంఛనమైంది.
రిషభ్ పంత్తో షురూ..
టీ20 గేమ్లో మూమెంటమ్ చాలా ముఖ్యంగా. ఈ మూమెంటమ్ను బ్రేక్ చేయడానికి ఆటగాళ్లు ఇలా ఇంజ్యూరీ డ్రామా ఆడటం సర్వసాధారణమైంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లోనూ రిషభ్ పంత్ ఇలానే ఇంజ్యూరీ డ్రామా ఆడి మ్యాచ్ను భారత్వైపు మలుపు తిప్పాడు. అప్పటి నుంచి చాలా మంది ఆటగాళ్లు రిషభ్ పంత్ను అనుసరిస్తున్నారు. అంతకుముందు కూడా చాలా మంది ఆటగాళ్లు ఇలాంటి డ్రామాలు ఆడారు. కానీ పంత్తో ఈ తరహా డ్రామాలకు ప్రాచూర్యం లభించింది. అయితే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్దమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆటగాళ్లు ఇలా ఫేక్ ఇంజ్యూరీ డ్రామా ఆడకుండా నిబంధనలను కఠినతరం చేయాలని సూచిస్తున్నారు.