మరోసారి బ్యాటింగ్ వైఫల్యమే తమ ఓటమిని శాసించిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. వచ్చే సీజన్ కోసం టీమ్ కాంబినేషన్పై ఫోకస్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డాడు. ఈ సీజన్లో సీఎస్కే పోరాటం ముగిసిందని, ప్లే ఆఫ్స్ చేరడం కష్టమని ధోనీ పరోక్షంగా హింట్ ఇచ్చాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 9 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. రోహిత్ శర్మ, సూర్యకుమార్ విధ్వంసకర బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ స్కోర్తో గెలవలేం..
ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన ధోనీ.. 177 పరుగుల లక్ష్యంతో విజయం సాధించలేమని, 20-25 పరుగులు తక్కువగా చేశామని అభిప్రాయపడ్డాడు. 'మేం చాలా తక్కువ స్కోర్ చేశాం. డ్యూ ప్రభావం చూపుతుందని మాకు తెలుసు. మిడిల్ ఓవర్లలో మేం మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యుత్తమ డెత్ బౌలర్లలో బుమ్రా ఒకడు. ముంబై ఇండియన్స్ కాస్త ముందుగానే డెత్ బౌలింగ్ను ప్రారంభించింది. మేం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముందుగానే హిట్టింగ్ చేయాల్సింది. స్లాగ్ ఓవర్లలో ఇంకొన్ని ఎక్కువ పరుగులు చేయాల్సింది. ఎందుకంటే డ్యూ ప్రభావం ఉన్న పరిస్థితుల్లో 175 పరుగుల లక్ష్యం ఏ మాత్రం సరిపోదు.
ఆయుష్ మాత్రే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. స్వేచ్ఛగా తన షాట్స్ ఆడాడు. అతని ఆటను మేం పెద్దగా చూడలేదు. అతనికి మంచి భవిష్యత్తు ఉంది. అతనిలా టాపార్డ్ చెలరేగితే మాకు తిరుగుండదు. హార్డ్ బాల్స్ గ్రిప్ అయ్యాయి. స్పిన్ను ముంబై ఇండియన్స్ బ్యాటర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సరైన లక్ష్యం లేనప్పుడు.. పవర్ ప్లేలోనే పరుగులిస్తే.. లక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా కష్టం.

వచ్చే ఏడాది కోసం..
మేం వీలైనంత త్వరగా మా తప్పిదాలను తెలుసుకొవాలి. మంచి క్రికెట్ ఆడితేనే సక్సెస్ సాధిస్తామనే విషయాన్ని గ్రహించాలి. అదే సమయంలో బాగా ఆడకపోతే భావోద్వేగానికి గురికాకుండా ఉండటం ముఖ్యం. 2020లో కూడా మేం గొప్పగా ఆడలేదు. కానీ ఆ మరుసటి ఏడాది పుంజుకున్నాం. ఇప్పుడు కూడా మాకు ఏదీ కలిసి రావడం లేదు. ప్రస్తుతం మేం ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్లన్నీ గెలవాలి. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ ముందుకు సాగాలి. ఒకవేళ కొన్ని మ్యాచ్లు ఓడిపోతే మాత్రం.. వచ్చే సీజన్ కోసం సరైన కాంబినేషన్పై ఫోకస్ పెట్టాలి. ఎక్కువ మంది ఆటగాళ్లను మార్చాల్సిన అవసరం లేదు. మెరుగైన ఆటతీరు కనబర్చి ప్లే ఆఫ్స్ చేరేందుకు ప్రయత్నిస్తాం. అలా కుదరకపోతే.. వచ్చే సీజన్ కోసం ఫైనల్ ఎలెవన్ ప్రిపేర్ చేసుకుంటాం. మళ్లీ బలంగా తిరిగొస్తాం.'అని ధోనీ చెప్పుకొచ్చాడు.
రోహిత్, సూర్య విధ్వంసం..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/25) రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు.
అనంతరం ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి గెలుపొందింది. రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. సీఎస్కే బౌలర్లలో రవీంద్ర జడేజా ఒక్కడే ఒక వికెట్ తీసాడు.