ఐపీఎల్ 2025 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) బౌలర్లు ఘనంగా ప్రారంభించారు. ముంబై ఇండియన్స్తో చెపాక్ మైదానం వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన కనబర్చారు. నూర్ అహ్మద్(4/14) రఫ్ఫాడించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది.
సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31)టాప్ స్కోరర్లుగా నిలవగా.. చివర్లో దీపక్ చాహర్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.

సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్తో పాటు ఖలీల్ అహ్మద్(3/29) మూడు వికెట్లు తీసాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్కు చెరో వికెట్ దక్కింది. తిలక్ వర్మతో కలిసి ఆచితూచి ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ను ధోనీ కళ్లు చెదిరే స్టంపింగ్తో పెవిలియన్ చేర్చి మ్యాచ్ను మలుపు తిప్పాడు. రెప్పపాటు సమయంలోనే ధోనీ ఈ స్టంపౌట్ చేయడం విశేషం. ధోనీ స్టంపింగ్కు సూర్య బిత్తరపోయాడు.
రోహిత్ డకౌట్..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై ఇండియన్స్కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ.. ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లోనే డకౌటయ్యాడు. తన మరుసటి ఓవర్లో ర్యాన్ రికెల్టన్(13)ను ఖలీల్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. విల్ జాక్స్(11)ను అశ్విన్ ఔట్ చేయడంతో 36 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ జట్టును ఆదుకున్నారు. ఆచితూచి ఆడిన ఈ జోడీ.. వీలుచిక్కిన బంతిని బౌండరీక తరలించింది. 51 పరుగులతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని నూర్ అహ్మద్ విడదీసాడు. ధోనీ కళ్లు చెదిరే స్టంపింగ్తో సూర్యను పెవిలియన్ చేర్చాడు. 0.12 సెకన్ల సమయంలోనే ధోనీ ఈ స్టంపౌట్ చేయడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
దీపక్ చాహర్ మెరుపులు..
ఆ తర్వాత ముంబై వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రాబిన్ మింజ్(3), నమన్ ధిర్(17), మిచెల్ సాంట్నర్(11), ట్రెంట్ బౌల్ట్(1) తీవ్రంగా నిరాశపరిచారు. దీపక్ చాహర్ 2 భారీ సిక్స్లతో జట్టు 155 పరుగుల గౌరవప్రదమైన స్కోర్ అందించాడు.