చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సిక్సర్ల రికార్డ్ సృష్టించాడు. టీ20 క్రికెట్లో 350 సిక్సర్ల మైలురాయిని సాధించాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్తో మంగళవారం జరిగిన మ్యాచ్లో ధోనీ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్లో 8వ స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోనీ 17 బంతులు ఆడి ఒకే ఒక్క సిక్సర్ బాది 16 పరుగులే చేసి ఔటయ్యాడు. ఆ సిక్సర్తోనే టీ20ల్లో 350 సిక్స్ల మైలురాయి అందుకున్నాడు. ఓవరాల్గా ఈ ఫీట్ సాధించిన 34వ ఆటగాడిగా ధోనీ నిలిచాడు.
ధోనీ కంటే ముందు భారత్ తరఫున రోహిత్ శర్మ(542 సిక్సర్లు), విరాట్ కోహ్లీ(434 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(368 సిక్సర్లు) ఈ ఫీట్ సాధించారు. ధోనీ తర్వాత సంజూ శాంసన్(348 సిక్సర్లతో) ఉన్నాడు. అతి త్వరలోనే సంజూ.. ధోనీని అధిగమించనున్నాడు. కేఎల్ రాహుల్(331 సిక్సర్లు)కూడా ధోనీకి చేరువలో ఉన్నాడు. ఓవరాల్గా క్రిస్ గేల్ 1056 సిక్సర్లతో టాప్లో ఉండగా.. మరే ఇతర బ్యాటర్ 1000 సిక్స్లు కొట్టలేదు. 10 మంది బ్యాటర్లు మాత్రమే 500 సిక్సర్లు కొట్టారు. అందులో భారత్ నుంచి రోహిత్ శర్మ మాత్రమే ఉన్నాడు.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 187 పరుగులు చేసింది. ఆయుష్ మాత్రే(20 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్తో 43), డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 42), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 39) రాణించారు.రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో యుధ్వీర్ సింగ్(3/47) , ఆకాశ్ మధ్వాల్(3/29) మూడేసి వికెట్లు తీయగా.. తుషార్ దేశ్పాండే, వానిందు హసరంగా తలో వికెట్ పడగొట్టారు. మరోసారి ధోనీ జిడ్డు బ్యాటింగ్ సీఎస్కే భారీ స్కోర్ను అడ్డుకుంది.