గుజరాత్ టైటాన్స్ స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ సహనం కోల్పోయాడు. తన సహచర ఆటగాడైన సాయి కిషోర్పై నోరుపారేసుకున్నాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్ చేసిన తప్పిదానికి అతన్ని ఏమనలేక సాయి కిషోర్పై మండిపడ్డాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కాగా.. సిరాజ్పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిరాజ్కు ఆట తక్కువ ఎక్స్ట్రాలు ఎక్కువ అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎస్కే ఇన్నింగ్స్ సందర్భంగా సిరాజ్ వేసిన ఐదో ఓవర్లో ఉర్విల్ పటే మిడాఫ్ దిశగా ఆడి సింగిల్ తీసాడు. అయితే బంతిని అందుకున్న శుభ్మన్ గిల్.. రనౌట్ చేసే ప్రయత్నంలో అనవసరంగా స్టంప్స్వైపు బంతిని కొట్టాడు. కానీ బ్యాకప్ ఎవరు లేకపోవడంతో బంతి దూరంగా వెళ్లింది. ఈ బంతిని సాయి కిషోర్ అందుకోలేకపోయాడు. బంతిని అడ్డుకునే క్రమంలో దాన్ని మరింత దూరం నెట్టాడు.

దాంతో మరో పరుగు వచ్చింది. ఒక్క పరుగు వచ్చే దగ్గర మూడు పరుగులు రావడంతో సిరాజ్ ఆగ్రహానికి గురయ్యాడు. బంతిని అందుకున్నఅతను నేలకు కొడుతూ సాయి కిషోర్ను బూతులు తిట్టాడు. గిల్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినిపించుకోలేదు. సిరాజ్ తీరును కామెంటేటర్ రవి శాస్త్రి తప్పుబట్టాడు. మియాకు ఏమైంది? అని మండిపడ్డాడు. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన గత మ్యాచ్లోనూ నికోలస్ పూరన్ను రెచ్చగొట్టి మరి సిరాజ్ మూల్యం చెల్లించుకున్నాడు. సిరాజ్ కవ్వింపులకు పూరన్ తన ఆటతోనే బదులిచ్చాడు. తాజాగా సాయికిషోర్పై నోరు పారేసుకోవడంతో సిరాజ్ను నెటిజన్లు తప్పుబడుతున్నారు.
ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 83 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 230 పరుగుల భారీ స్కోర్ చేసింది. డెవాన్ కాన్వే(52), డెవాల్డ్ బ్రెవిస్(57) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం గుజరాత్ టైటాన్స్ 147 పరుగులకే పరిమితమై ఘోర పరాజయాన్నిచవిచూసింది.