టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తన ఐపీఎల్ కెరీర్ను సారథిగానే ముగించాలని మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ సూచించాడు. కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టులోకి వెళ్లాలని సలహా ఇచ్చాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ).. తమ జట్టు సారథ్య బాధ్యతలు చేపట్టేలా రోహిత్ శర్మను ఒప్పించాలన్నాడు.
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్.. సారథ్య బాధ్యతల నుంచి రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాను కెప్టెన్గా ఎంచుకున్న విషయం తెలిసిందే. టీమ్ భవిష్యత్తు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ముంబై ఇండియన్స్ వివరణ ఇచ్చింది. అయితే ఈ నిర్ణయంపై ముంబై ఇండియన్స్ అభిమానులతో పాటు ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

రోహిత్పై కన్నేసిన ఫ్రాంచైజీలు..
రోహిత్ శర్మ కూడా అసంతృప్తితో ఉన్నాడని, ఆ జట్టును వీడేందుకు కూడా సిద్దమయ్యాడని వార్తలు వచ్చాయి. అదే నిజమైతే.. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనుండటంతో రోహిత్ శర్మను తీసుకునేందుకు ఫ్రాంచైజీలు ఆసక్తికనబరుస్తున్నాయి. అతను వేలంలోకి వస్తే మాత్రం కోట్లు పలికే ఛాన్స్ ఉంది. మరోవైపు ఆర్సీబీ కూడా రోహిత్ శర్మను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చు.
'ఐపీఎల్లో రోహిత్ శర్మ కెప్టెన్గా మాత్రమే ఆడాలి. ఎందుకంటే అతను గొప్ప సారథి. ఇటీవలే అతను టీమిండియాకు టీ20 ప్రపంచకప్ అందించాడు. ఐపీఎల్లో అతనికి కెప్టెన్సీ ఆఫర్స్ చాలా ఉన్నాయి. ఏయే ఫ్రాంచైజీలు రోహిత్ శర్మను తీసుకునేందుకు ఆసక్తిచూపుతున్నాయో మాకు తెలుసు. అయితే అతను మాత్రం సారథ్య బాధ్యతలు అప్పగించే జట్టులోకి మాత్రమే వెళ్లాలి.
ఆర్సీబీ కన్విన్స్ చేయాలి..
ఈ అవకాశాన్ని ఆర్సీబీ సద్వినియోగం చేసుకోవాలి. తమ జట్టు సారథ్య బాధ్యతలను స్వీకరించేలా రోహిత్ శర్మ ఒప్పించాలి. బ్యాటర్గా అతను భారీ స్కోర్లు చేయలేకపోవచ్చు. కానీ 40, 50లతో రాణించగలడు. అంతేకాకుండా తుది జట్టును ఎలా నిర్మించాలో రోహిత్ శర్మకు బాగా తెలుసు.'అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
ఐపీఎల్ 2022 సీజన్ తర్వాత విరాట్ కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోగా.. ఫాఫ్ డుప్లెసిస్ ఆ జట్టును నడిపించాడు. అయితే అతని వయసు దృష్ట్యా ఆర్సీబీ అతన్ని రిటైన్ చేసుకోవడం సందేహంగా మారింది. ఈ క్రమంలోనే రోహిత్ శర్మను ఆర్సీబీ కొనుగోలు చేస్తే టైటిల్ నిరీక్షణకు తెరపడుతుందని కైఫ్ సూచించాడు.
'రోహిత్ శర్మతో ఆర్సీబీకి లాభం చేకూరుతోంది. 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరపడుతోంది. జట్టును ఛాంపియన్గా నిలబెట్టడం ఎలాగో రోహిత్ శర్మకు బాగా తెలుసు. ఆటగాళ్ల భుజాలను తట్టి అత్యుత్తమ ప్రదర్శన రాబట్టే సామర్థ్యం రోహిత్ శర్మకు ఉంది. అంతేకాకుండా తుది జట్టులో ఏ ప్లేస్లో ఎవరిని ఆడించాలనేది కూడా బాగా తెలుసు. ఆర్సీబీకి అవకాశం వస్తే రోహిత్ శర్మనే కెప్టెన్గా ఎంచుకుంటుంది.'అని మహమ్మద్ కైఫ్ అన్నాడు.