స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా బుధవారం ఢిల్లీ వేదికగా జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ సూపర్ ఓవర్లో గెలుపొందింది. ఆఖరి ఓవర్లో రాజస్థాన్ విజయానికి 9 పరుగులు అవసరమవ్వగా.. స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక్క బౌండరీ ఇవ్వకుండా మ్యాచ్ను టై చేశాడు. సూపర్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అయితే మ్యాచ్ అనంతరం ఉమ్ము(సెలైవా) సాయంతోనే రివర్స్ స్వింగ్ రాబట్టావా? అని ప్రశ్నించగా.. అతను కొట్టిపాడేశాడు. తాను అసలు ఉమ్మును అస్సలు వాడనని, చెమటను ఎక్కువగా బంతికి పూసేందుకు ప్రయత్నిస్తానని తెలిపాడు. ఉమ్మి వల్ల వైట్బాల్ క్రికెట్లో పెద్దగా ప్రయోజనం ఉండదని చెప్పాడు.

'నేను ఉమ్మి వాడను. దానివల్ల ఏదో ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. అసలు ఉమ్మికి, చెమటకు పెద్ద తేడా ఏం ఉండదు. ఉమ్మి ఎర్రబంతిపై ప్రభావం చూపిస్తుందేమో కానీ.. వైట్ బాల్ క్రికెట్లో పని చేయదు. ఈ మ్యాచ్లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. పక్కా ప్రణాళికతో బౌలింగ్ చేశా. నేను ఎలా బౌలింగ్ చేయాలనుకున్నానో అలానే చేశా. ఇప్పటి వరకు నేను ఎలా ఆడానన్నది అందరికి తెలుసు. ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు వెళ్లడం థ్రిల్లింగ్గా ఉంది.
సూపర్ ఓవర్లో నో బాల్ వేసిన వెంటనే పుంజుకున్నా. రనౌట్ల రూపంలో మాకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత మా బ్యాటర్లు అలవోకగా ఆడేసారు.'అని మిచెల్ స్టార్క్ చెప్పుకొచ్చాడు. కరోనా కారణంగా సెలైవాపై నిషేధం విధించిన బీసీసీఐ ఇటీవలే ఆ బ్యాన్ను ఎత్తేసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్(37 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 49), కేఎల్ రాహుల్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ట్రిస్టన్ స్టబ్స్(18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 34 నాటౌట్), అక్షర్ పటేల్(14 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 34) మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/32) రెండు వికెట్లు తీయగా.. మహీష్ తీక్షణ(1/40), వానిందు హసరంగా(1/38) చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. యశస్వి జైస్వాల్(37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్లతో 51), నితీష్ రాణా(28 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లతో 51) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో అక్షర్ పటేల్(1/23), కుల్దీప్ యాదవ్(1/33), మిచెల్ స్టార్క్(1/36) తలో వికెట్ తీసారు. సూపర్ ఓవర్లో రాజస్థాన్ 11 పరుగులు చేయగా.. ఢిల్లీ నాలుగు బంతుల్లోనే 13 పరుగులు చేసి విజయం సాధించింది.