ఐపీఎల్ 2025 సీజన్లో తప్పక గెలవాల్సిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్లు దుమ్మురేపారు. సన్రైజర్స్ హైదరాబాద్తో లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఓపెనర్లు మిచెల్ మార్ష్(39 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్స్లతో 65), ఎయిడెన్ మార్క్రమ్(38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 61) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. దాంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోర్ చేసింది.
నికోలస్ పూరన్(26 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 45) దూకుడుగా ఆడాడు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ఇషాన్ మలింగా(2/28) రెండు వికెట్లు తీయగా.. హర్ష్ దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డిలు తలో వికెట్ తీసారు.

టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. దూకుడుగా ఆడిన ఈ జోడీ పవర్ ప్లేలోనే 69 పరుగులు చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడటంతో లక్నో 9 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ను అందుకుంది. ఈ క్రమంలోనే మార్ష్, మార్క్రమ్ 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు.115 పరుగులతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని అరంగేట్ర ప్లేయర్ హర్ష్దూబే విడదీసాడు. మిచెల్ మార్ష్ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
క్రీజులోకి వచ్చిన రిషభ్ పంత్(7)ను ఇషాన్ మలింగా అద్భుతమైన రిటర్న్ క్యాచ్తో వెనక్కి పంపాడు. మార్క్రమ్ను హర్షల్ పటేల్ క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆయుష్ బదోని(3)ని మలింగా ఔట్ చేయడంతో లక్నో పరుగుల వేగం తగ్గింది. ఓవైపు వికెట్లు పడినా మరోవైపు పూరన్ దూకుడుగా ఆడాడు. ఆఖరి ఓవర్లో భారీ సిక్సర్ బాదిన అతను రనౌట్గా వెనుదిరిగాడు. క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ బౌండరీ బాది రనౌటయ్యాడు. అబ్దుల్ సమద్ను నితీష్ కుమార్ రెడ్డి క్లీన్ బౌల్డ్ చేయగా.. ఆకాశ్ దీప్ ఆఖరి బంతికి సిక్స్ బాది జట్టు స్కోర్ను 200 ధాటించాడు.