ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ గాయంపై ఆ జట్టు హెడ్ కోచ్ మహేళ జయవర్దనే కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ఒంటి కాలితో కూడా క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతాడని స్పష్టం చేశాడు. అతని గాయం పెద్దది కాదని, పూర్తి ఫిట్గా ఉన్నాడని స్పష్టం చేశాడు. ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో క్వాలిఫయర్-2కు అర్హత సాధించిన ముంబై.. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో తలపడనుంది.
అయితే ఈ మ్యాచ్కు సూర్యకుమార్ యాదవ్ దూరమవుతాడని ప్రచారం జరిగింది. గుజరాత్తో మ్యాచ్లో సూర్య ఫీల్డింగ్ చేస్తుండగా తొడ కండరాలు పట్టేయడంతో మైదానం వీడాడు. అతని గాయంపై మహేళ జయవర్దనే స్పందించాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ముంబై ఆటగాళ్లంతా ఫిట్గానే ఉన్నారని స్పష్టం చేశాడు. ఒకవేళ ఫిట్గా లేకున్నా.. ఒంటికాలితో క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడుతారని పేర్కొన్నాడు.

'సూర్య గాయం తీవ్రమైనది కాదు. ఫిజియోలు కూడా గాయం తీవ్రమైనదని చెప్పలేదు. ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. ఒకవేళ అతను ఒక కాలితో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా.. పంజాబ్తో మ్యాచ్లో బరిలోకి దిగుతాడు. మాకు కఠినమైన షెడ్యూల్ ఉందనే విషయం తెలుసు. అయితే మా జట్టులో ప్రతీ ఆటగాడు ఆరోగ్యంగా.. ఫిట్గా ఉన్నారు. చిన్నపాటి నలతల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆటగాళ్ల గాయాల విషయంపై ఫిజియోల నుంచి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఒక కాలుతో అయినా మా ఆటగాళ్లు ఆడతారని నేను ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి కంగారుపడకండి.'అని జయవర్దనే స్పష్టం చేశాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో సూర్యకుమార్ యాదవ్ నిలకడగా రాణించాడు. 15 మ్యాచ్ల్లో 67.30 సగటుతో 673 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రతీ మ్యాచ్లో సూర్య 25 ప్లస్ రన్స్ చేయడం గమనార్హం. ముంబై తరఫున సూర్యనే టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. పంజాబ్తో మ్యాచ్లో సూర్య కీలకం కానున్నాడు.