రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా చరిత్ర సృష్టించాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఫైనల్స్లో రెండు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న ఏకైక ప్లేయర్గా నిలిచాడు. మరే ఆటగాడు ఈ ఫీట్ సాధించలేదు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో 18 ఏళ్ల టైటిల్ నిరీక్షణకు తెరదించింది. ఈ కీలక ఫైనల్లో కృనాల్ పాండ్యా (2/17) అసాధారణ బౌలింగ్ ప్రదర్శనతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఒకే ఒక్కడు..
కృనాల్ పాండ్యాకు ఇది నాలుగో ఐపీఎల్ టైటిల్. గతంలో అతను ముంబై ఇండియన్స్ తరఫున మూడు టైటిల్స్ అందుకున్నాడు. 2017, 2019 సీజన్లతో పాటు 2020 సీజన్లలో ముంబై తరఫున కృనాల్ పాండ్యా టైటిల్ అందుకున్నాడు. ఐపీఎల్ 2017 ఫైనల్లో కృనాల్ పాండ్యా(38 బంతుల్లో 47) అసాధారణ బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే మరే ఆటగాడు కూడా రెండు ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకోలేదు.

17 వికెట్లతో..
ఐపీఎల్ 2016లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన కృనాల్ పాండ్యా 2021 వరకు ఆ జట్టులో కొనసాగాడు. ఐపీఎల్ 2022 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్కు మారిన అతను గతేడాది వరకు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కృనాల్ పాండ్యాను ఆర్సీబీ రూ. 5.75 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్లో కృనాల్ పాండ్యా అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. బ్యాటింగ్లో విఫలమైనా.. బౌలింగ్లో దుమ్మురేపాడు. 15 మ్యాచ్ల్లో 8.24 ఎకానమీతో 17 వికెట్లు తీసాడు.
ఆదుకున్న కోహ్లీ..
ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలవగా.. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.
అనంతరం 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులే చేసి ఓటమిపాలైంది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్లతో 61 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించినా ఫలితం లేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్(2/38), కృనాల్ పాండ్యా(2/17) రెండేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, రొమారియో షెపర్డ్ తలో వికెట్ తీసారు. శ్రేయస్ అయ్యర్(1) వైఫల్యం ఆర్సీబీకి కలిసొచ్చింది.