టీమిండియా స్టార్ బ్యాటర్, ప్రస్తుత లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తిరిగి సొంతగూటికి చేరనున్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో అతను లక్నో సూపర్ జెయింట్స్ను వీడి తన రాష్ట్రానికి చెందిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
లక్నో సూపర్ జెయింట్స్ మేనేజ్మెంట్కు కేఎల్ రాహుల్ మధ్య బేధాభిప్రాయాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సందర్భంగా కేఎల్ రాహుల్ను.. లక్నో ఫ్రాంఛైజీ ఓనర్ సంజీవ్ గోయెంకా మైదానంలోనే తిట్టాడు. సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఎదురైన ఘోర పరాజయంతో సహనం కోల్పోయినా సంజీవ్ గోయెంకా.. టీవీ కెమెరాలు ఉన్నాయనే విషయం కూడా మరిచి మైదానంలోనే రాహుల్ మందలించాడు. కేఎల్ రాహుల్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా.. సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు.

ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సంజీవ్ గోయెంకా తీరుపై మాజీ క్రికెటర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేఎల్ రాహుల్ లక్నో జట్టును వీడుతాడని అప్పుడే జోరుగా ప్రచారం జరిగింది. ఇక కర్ణాటకకు చెందిన కేఎల్ రాహుల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు మారాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
వాస్తవానికి కేఎల్ రాహుల్.. ఆర్సీబీతోనే ఐపీఎల్లోకి అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ 2013 నుంచి 2016 వరకు ఆర్సీబీ తరఫున ఆడాడు. గాయం కారణంగా 2017 సీజన్కు దూరంగా ఉన్న అతను 2018 మెగా వేలానికి ముందు పంజాబ్ జట్టుకు మారిపోయాడు. నాలుగేళ్ల పాటు పంజాబ్ కింగ్స్కు ఆడిన అతను ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్కు మారాడు.
తాజాగా మళ్లీ ఆర్సీబీలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సంజీవ్ గోయెంకాతో గొడవ సందర్భంగా కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ కేఎల్ రాహుల్కు అండగా నిలిచారు. ఆర్సీబీలోకి వచ్చేయ్ అని రాహుల్ను కోరారు. ఇప్పుడు ఆ దిశగానే కేఎల్ రాహుల్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఫాఫ్ డుప్లెసిస్ స్థానంలో కేఎల్ రాహుల్ ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీతో కలిసి ఓపెనింగ్ చేయవచ్చు. కేఎల్ రాహుల్ను తీసుకునేందుకు ఆర్సీబీ కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.