ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సారి కెప్టెన్సీ బాధ్యతలకు దూరంగా ఉండాలని ఈ కర్ణాటక బ్యాటర్ భావిస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్ 2025 సీజన్లో కేఎల్ రాహుల్.. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రాహుల్ను రూ. 14 కోట్ల భారీ ధరకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
గత సీజన్ వరకు లక్నో సూపర్ జెయింట్స్కు ప్రాతినిథ్యం వహించిన రాహుల్.. ఆ జట్టు టీమ్మేనేజ్మెంట్తో వచ్చిన విభేదాలతో బయటకు వచ్చేసాడు. లక్నో మేనేజ్మెంట్ కన్విన్స్ చేసినా జట్టులో కొనసాగేందుకు నిరాకరించాడు. గతంలో అతను పంజాబ్ కింగ్స్కు కూడా సారథ్యం వహించాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతల కారణంగా తన బ్యాటింగ్ ప్రదర్శన దెబ్బతింటుందని రాహుల్ భావిస్తున్నాడట. ఇప్పటికే టీమిండియా టీ20 జట్టులో రాహుల్కు చోటు లేదు.

కెప్టెన్సీకి దూరం..
ఈ క్రమంలోనే ఐపీఎల్ 2025లో సత్తా చాటి భారత జట్టుకు రీఎంట్రీ ఇవ్వాలనే ఆలోచన రాహుల్ ఉన్నట్లు జాతీయ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్కు రాహుల్ ప్రత్యేక విజ్ఞప్తి చేశాడంట. తనకు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వదని కోరాడట. కేవలం ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని స్పష్టం చేశాడట. కెప్టెన్సీ ఆఫర్ను రాహుల్ తిరస్కరించడంతో అక్షర్ పటేల్ను తమ సారథిగా ప్రకటించేందుకు ఢిల్లీ క్యాపిటల్స్ సిద్దమైనట్లు తెలుస్తోంది.
గత సీజన్ వరకు ఢిల్లీని రిషభ్ పంత్ నడిపించాడు. ఆ టీమ్ మేనేజ్మెంట్తో వచ్చిన విభేదాలతో అతను ఆ జట్టును వీడాడు. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల ఆల్టైమ్ రికార్డ్కు కొనుగోలు చేసింది. అతన్నే తమ జట్టు కెప్టెన్గా ప్రకటించింది. రిషభ్ పంత్ గైర్హాజరీలో ఢిల్లీ క్యాపిటల్స్ను అక్షర్ పటేల్ నడిపించాడు. కానీ అతనికి సారథ్య బాధ్యతలు కొత్తే. దేశవాళీ క్రికెట్లోనూ అతను ఎక్కువగా కెప్టెన్సీ చేయలేదు. కానీ అక్షర్ పటేల్ ప్రస్తుతం సూపర్ ఫామ్లో ఉన్నాడు.
ఢిల్లీ కెప్టెన్గా అక్షర్ పటేల్..
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతన్ని ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 16.5 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. 2019 నుంచి అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్కే ఆడుతున్నాడు. ఇప్పటి వరకు అతను 150 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 1653 పరుగులు, 123 వికెట్ల తీసాడు. అక్షర్ పటేల్ స్ట్రైక్రేట్ 130.88గా ఉండగా.. బౌలింగ్ ఎకానమీ 7.28గా ఉంది. ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన టీ20 సిరీస్లోనూ అక్షర్ పటేల్ వైస్కెప్టెన్గా వ్యవహరించాడు.
ఆరంభ మ్యాచ్లకు రాహుల్ దూరం..
ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభ మ్యాచ్లకు కేఎల్ రాహుల్ దూరంకానున్నాడు. ప్రస్తుతం అతని సతీమణి అతియా శెట్టి గర్భవతి. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రసవ సమయంలో ఆమె పక్కన ఉండాలని రాహుల్ నిర్ణయించుకున్నాడట. దాంతోనే అతను ఐపీఎల్ 2025 సీజన్ ఆరంభ మ్యాచ్లకు దూరం కానున్నాడు. ఇప్పటికే ఈ విషయమై ఢిల్లీ మేనేజ్మెంట్ నుంచి అనుమతి తీసుకున్నాడట. ఢిల్లీ క్యాపిటల్స్ తమ తొలి మ్యాచ్ను మార్చి 24న ఆడనుంది. వైజాగ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్తో తలపడనుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్:
కేఎల్ రాహుల్, హ్యారీ బ్రూక్, జేక్ ఫ్రేజర్-మెక్గుర్క్, కరుణ్ నాయర్, ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా, అక్షర్ పటేల్, సమీర్ రిజ్వి, అశుతోష్ శర్మ, దర్శన్ నల్కండే, విప్రాజ్ నిగమ్, అజయ్ మండల్, మిచెల్ స్టార్క్, టీ నటరాజన్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, త్రిపురాన విజయ్, మాధవ్ తివారీ, మన్వంత్ కుమార్, దుష్మంత చమీరా ఉన్నారు.