ఐపీఎల్ 2025 సీజన్లో కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మరో విజయాన్నందుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కేకేఆర్ అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమకు అలవాటైన రీతిలోనే మరోసారి గెలుపు ముంగిట బోర్లా పడింది. ఆఖరి బంతికి 3 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. ఈ మ్యాచ్లో రాజస్థాన్ ఓడినా.. శుభమ్ దూబే(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 25 నాటౌట్) పోరాటం ఆకట్టుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 57 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అంగ్క్రిష్ రఘువంశీ(31 బంతుల్లో 5 ఫోర్లతో 44), రెహ్మానుల్లా గుర్బాజ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్(6 బంతుల్లో ఫోర్, 2 సిక్స్లతో 19 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యధ్వీర్ సింగ్, మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.

అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్లతో 95) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో అతను ఔటవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్లో మరోసారి రాజస్థాన్ రాయల్స్ ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(34), షిమ్రాన్ హెట్మైర్(29) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివర్లో శుభమ్ దూబే పోరాడిన ఫలితం దక్కలేదు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, మోయిన్ అలీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.
అయితే వైభవ్ అరోరా వేసిన ఆఖరి ఓవర్లో హైడ్రామా చోటు చేసుకుంది. రాజస్థాన్ రాయల్స్ విజయానికి 6 బంతుల్లో 22 పరుగులు అవసరమవ్వగా.. ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబే వరుసగా 6, 4, 6 బాది మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు. ఆఖరి బంతికి 3 పరుగులు అవసరమవ్వగా.. క్విక్ డబుల్ తీసే క్రమంలో ఆర్చర్ రనౌటయ్యాడు. దాంతో రాజస్థాన్ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. సెంచరీ దిశగా సాగిన రియాన్ పరాగ్ను ఔట్ చేసి హర్షిత్ రాణా మ్యాచ్ను కేకేఆర్వైపు మలుపు తిప్పాడు.