ఐపీఎల్ 2025 సీజన్లో మరో మ్యాచ్ వర్షార్పణమైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) మధ్య బెంగళూరు వేదికగా శనివారం జరగాల్సిన మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయ్యింది. కుండపోత వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహించలేని పరిస్థితి ఏర్పడటంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దాంతో ఆర్సీబీ 17 పాయింట్స్తో టేబుల్ టాపర్గా నిలిచి ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. మరోవైపు కేకేఆర్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. ఆ జట్టు ఆఖరి మ్యాచ్లో విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితి ఏర్పడింది.
వారం రోజుల విరామం తర్వాత ఐపీఎల్ 2025 మ్యాచ్ను ఆస్వాదించాలని భావించిన అభిమానులకు తీవ్ర నిరాశే ఎదురైంది. భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను బీసీసీఐ వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడంతో టోర్నీ తిరిగి శనివారం ప్రారంభమైంది. కానీ ఐపీఎల్ రీస్టార్ట్లో తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది. టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీకి ఘనంగా వీడ్కోలు పలకాలని ఈ మ్యాచ్కు వైట్ జెర్సీలో హాజరైన ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా నిరాశగా ఇంటిబాట పట్టారు.

ఆర్సీబీ టాప్..
చిన్నస్వామి స్టేడియంలో అధునాతన డ్రైనేజీ వ్యవస్థ ఉన్నా.. వర్షం ఎడతెరిపి లేకుండా కురవడంతో మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్సీబీ 12 మ్యాచ్ల్లో 8 విజయాలు ఓ మ్యాచ్ రద్దుతో 17 పాయింట్స్తో పాయింట్స్ టేబుల్లో అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఆర్సీబీ టాప్-2 ప్లేస్లో నిలవాలంటే చివరి రెండు మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. ఒక్క మ్యాచ్ గెలిచినా రెండో ప్లేస్ ఖాయమవుతోంది.
కేకేఆర్ ఔట్..
కేకేఆర్ 13 మ్యాచ్ల్లో 5 విజయాలు, రెండు మ్యాచ్ల రద్దుతో 12 పాయింట్స్తో ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఆఖరి మ్యాచ్ గెలిచినా కేకేఆర్ ఖాతాలో 14 పాయింట్స్ ఉంటాయి. కాబట్టి టోర్నీలో ముందడుగు వేయలేని పరిస్థితి.