ఐపీఎల్ 2025 సీజన్ నేపథ్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్రైడర్స్(కేకేఆర్) తమ కెప్టెన్గా వెటరన్ బ్యాటర్ అజింక్యా రహానేను నియమించింది. గత సీజన్లో కేకేఆర్ను నడిపించిన శ్రేయస్ అయ్యర్.. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి ముందు జట్టును వీడటంతో కొత్త కెప్టెన్ను ప్రకటించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే సీనియర్ ప్లేయర్ అయిన రహానేకు జట్టు పగ్గాలను అప్పగించిన కేకేఆర్.. వెంకటేశ్ అయ్యర్కు వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని కేకేఆర్ సోమవారం తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో వెల్లడించింది.
వెంకటేశ్ అయ్యర్ను భవిష్యత్తు సారథిగా నియమించాలనే ఉద్దేశంతోనే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. కేకేఆర్ కెప్టెన్గా రింకూ సింగ్ను నియమిస్తారని ప్రచారం జరిగినా.. మేనేజ్మెంట్ అనుభవానికే ప్రాధాన్యత ఇచ్చింది. టీమిండియాకు దూరమైనా.. దేశవాళీ క్రికెట్లో ముంబై సారథిగా రహానే సత్తా చాటుతున్నాడు. గతేడాది రంజీ ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలను రహానే సారథ్యంలోనే ముంబై గెలిచింది.

కేకేఆర్ తాజా ప్రకటనతో ఢిల్లీ క్యాపిటల్స్ మినహా అన్ని జట్ల సారథులు ఎవరో తేలిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్ లేదా అక్షర్ పటేల్లో ఒకరిని కెప్టెన్గా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్లో బరిలోకి దిగే కొత్త జెర్సీని కూడా కోల్కతా నైట్రైడర్స్ ఆవిష్కరించింది. మూడు టైటిళ్లు గెలిచామనే విషయం తెలియజేసేలా జెర్సీపై మూడు స్టార్లకు చోటు కల్పించింది. జెర్సీ ఆవిష్కరణకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
'కేకేఆర్ మూడు టైటిళ్లు గెలిచిందనే విషయాన్ని తెలియజేసేలా జెర్సీపై మూడు స్టార్లు కేటాయించాం. మే 27, 2012, జూన్ 1, 2014, మే 26, 2024న మేం టైటిళ్లు సాధించాం. మిథున రాశి రోజునే ఈ ఫలితాలు వచ్చాయి. గతేడాది గెలిచిన టైటిల్ మమ్మల్ని మళ్లీ అగ్రస్థానానికి చేర్చింది. ఈసారి కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తాం. మూడు టైటిళ్లకు కర్చో, లోర్చో, జీత్చో అని పేరు పెట్టాం. బెంగాలీ పదాలైన వీటికి ప్రదర్శన, పోరాటం, విజయం అని అర్థం. ఛాంపియన్ వారసత్వాన్ని కొనసాగించేందుకు స్పూర్తిగా ఈ పదాలు నిలుస్తాయి.'అని కేకేఆర్ అధికారి బిందా దే తెలిపారు.