ఐపీఎల్ 2025 మెగా వేలానికి సిద్దమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి కొత్త సమస్య ఎదురైంది. స్థానిక ఆటగాళ్లను జట్టులో భాగం చేసుకోవాలని, అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కర్ణాటకకు చెందిన విజయ్కుమార్ వైశాఖ్, మనోజ్ భాండాగేను రిటైన్ చేసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ ఫ్రాంచైజీకి సూచించినట్లు సమాచారం.
అనామక ఆటగాళ్లు అయిన ఈ ఇద్దరిని రూ. 4 కోట్ల చొప్పున రిటైన్ చేసుకోవాలని సూచించినట్లు కథనాలు వస్తున్నాయి. కర్ణాటక ప్రభుత్వం డిమాండ్తో ఆర్సీబీ మేనేజ్మెంట్కు ఏం చేయాలో అర్థం కావడం లేదంట. ఈ డిమాండ్ వల్ల టీమ్ ప్రణాళికలు దెబ్బతింటాయని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావిస్తోందంట.

ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను ప్రకటించింది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చని పేర్కొంది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది. ఇక నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు.
అయితే రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది.
అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని బీసీసీఐ పది ఫ్రాంచైజీలను ఆదేశించింది. నవంబర్ 30న ఐపీఎల్ వేలం నిర్వహించాలనుకుంటోంది. ఆర్సీబీ విరాట్ కోహ్లీ, మహమ్మద్ సిరాజ్, కామెరూన్ గ్రీన్, రజత్ పటీదార్, ఆకాశ్ దీప్, యశ్ దయాల్ వంటి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవాలనుకుంటోంది. రిటెన్షన్ ప్రక్రియలో కర్ణాటక ప్రభుత్వ డిమాండ్ను ఆర్సీబీ పట్టించుకోకపోవచ్చు. కానీ వేలంలో కర్ణాటకకు చెందిన కుర్రాళ్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. లోకల్ భాయ్ కేఎల్ రాహుల్ను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ వ్యూహాలు రచిస్తోంది.