రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడం స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఇష్టం లేదని ఆ జట్టు యువ ప్లేయర్ జితేష్ శర్మ అన్నాడు. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలం అనంతరం విరాట్ కోహ్లీనే తిరిగి సారథ్య బాధ్యతలు చేపడుతాడని జోరుగా ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఆర్సీబీ మాత్రం యువ బ్యాటర్ రజత్ పటీదార్ను కెప్టెన్గా నియమించింది. విరాట్ కోహ్లీ సూచనలతోనే ఆర్సీబీ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.
మాజీ క్రికెటర్లు మాత్రం విరాట్ కోహ్లీనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సిందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొనే రజత్ పటీదార్ను ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలంలో రూ. 11 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన జితేష్ శర్మ.. ఆర్సీబీ కెప్టెన్సీపై ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమ్ కెప్టెన్సీ నిర్ణయం అందరితో పాటే తనకు తెలిసిందని, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడానికి కోహ్లీ సుముఖంగా లేకపోవడంతోనే రజత్ పటీదార్ను ఎంపిక చేసినట్లు అర్థమవుతుందని చెప్పాడు.

'రజత్ పటీదార్ కెప్టెన్గా నియమించామని ప్రకటన వచ్చిన తర్వాతే నాకు తెలిసింది. కానీ ఓ ఆటగాడిగా తెరవెనుక ఏం జరిగిందో అంచనా వేయగలను. కెప్టెన్సీ స్వీకరించేందుకు కోహ్లీ సుముఖంగా లేడనే విషయం అర్థమవుతోంది. ఇందుకు గల ఖచ్చితమైన కారణం నాకు తెలియదు. మూడేళ్ల క్రితమే కోహ్లీ కెప్టెన్సీ కెరీర్ ముగిసిందనేది నా అభిప్రాయం. నేను అయితే మేనేజ్మెంట్లో భాగం కాదు. కానీ గత మూడేళ్లుగా కెప్టెన్సీకి దూరంగా ఉన్నాడు. అందుకే ఈసారి కూడా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టలేదని అర్థమవుతోంది. రజత్ పటీదార్ ఎంపిక సరైనదే. మాకు కాలం కలిసొస్తే వరుసగా 3-4 ఐపీఎల్ టైటిళ్లు గెలుస్తాం.'అని జితేష్ శర్మ చెప్పుకొచ్చాడు.
17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ ఒక్క టైటిల్ కూడా గెలవలేదు. రెండు సార్లు ఫైనల్ చేరి తృటిలో టైటిల్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ కెరీర్లో ఏదైనా లోటు ఉందా? అంటే అది ఐపీఎల్ టైటిల్ మాత్రమే.