ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ క్వాలిఫయర్-2కు అర్హత సాధించింది. గుజరాత్ టైటాన్స్తో శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ ఔటైనా.. మరో ఓపెనర్ సాయి సుదర్శన్... వాషింగ్టన్ సుందర్తో కలిసి అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారడంతో ఈ ఇద్దరూ బౌండరీల మోత మోగించారు.
ఈ జోడీ క్రీజులో ఉన్నంత సేపు ముంబై ఆటగాళ్లు వణికిపోయారు. వాషింగ్టన్ సుందర్ కొట్టిన వరుస సిక్స్లకు డగౌట్లోని రోహిత్ శర్మ నెత్తిని పట్టుకున్నాడు. ఈ ఇద్దరూ బ్యాటింగ్ చేస్తున్నంత సేపు గుజరాత్ విజయం ఖాయమని అంతా అనుకున్నారు. ముంబై కోచ్లు బౌండరీ లైన్పై నిలబెడుతూ ఆటగాళ్లకు తమ సలహాలు ఇచ్చారు. ముఖ్యంగా సాయి సుదర్శన్-వాషింగ్టన్ సుందర్ జోడీని విడదీసేందుకు శతవిధాల ప్రయత్నించారు.

ఈ క్రమంలోనే బౌండరీ లైన్ వద్ద ఉన్న జస్ప్రీత్ బుమ్రాకు మహేళ జయవర్దనే సలహా ఇచ్చే ప్రయత్నం చేశాడు. బుమ్రా మాత్రం అతని మాట వినకుండా.. 'మీ పని మీరు చేసుకోండి సర్.. విసిగించకండి'అంటూ సైగలు చేశాడు. దాంతో జయవర్దనే నిశబ్దంగా వెనుదిరిగాడు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా సలహా ఇవ్వబోతుంటే కూడా జస్ప్రీత్ బుమ్రా పట్టించుకోలేదు. దయచేసి నన్ను వదిలేయండని సైగలు చేశాడు. ఆ తర్వాత బుమ్రా స్టన్నింగ్ యార్కర్తో వాషింగ్టన్ సుందర్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దాంతో మూడో వికెట్కు నమోదైన 84 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ కాసేపటికే సాయి సుదర్శన్ కూడా ఔటవ్వడంతో ముంబై విజయం లాంఛనమైంది.
అయితే బుమ్రా వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. కోచ్, కెప్టెన్ పట్ల బుమ్రా దురుసుగా ప్రవర్తించడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. కెప్టెన్సీ ఇవ్వకపోవడంతోనే బుమ్రా ఇలా చేస్తున్నాడని కామెంట్ చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం బుమ్రాను వెనుకేసుకొచ్చారు. క్లిష్ట పరిస్థితుల్లో బుమ్రాను డిస్టర్బ్ చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు.