ఐపీఎల్ 2025 సీజన్కు ముందు మెగా వేలం జరగనుంది. ఇప్పటికే వేలం నిర్వహణపై ఫోకస్ పెట్టిన భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. రిటెన్షన్స్ రూల్స్ను సిద్దం చేస్తోంది. 10 ఫ్రాంచైజీల ఓనర్లతో సమావేశమైన బీసీసీఐ.. వారి సలహాలు, సూచనలను కూడా స్వీకరించింది. మెగా వేలం నేపథ్యంలో జట్లన్నీ పూర్తిగా మారిపోనున్నాయి.
రిటెన్షన్ పాలసీపై ఇంకా స్పష్టత రాకున్నా.. గరిష్టంగా నాలుగు నుంచి ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే అంటిపెట్టుకునే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. ఆ జట్టును వీడుతాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.

హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై జస్ప్రీత్ బుమ్రా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. ఓ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరూ వాగ్వాదానికి దిగడం, హార్దిక్ సూచనలను బుమ్రా బేఖాతరు చేయడం కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా వైరలయ్యాయి.
అంతేకాకుండా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బుమ్రా.. కెప్టెన్సీపై ఆసక్తి చూపించడం, పేస్ బౌలర్లకు సారథ్య అవకాశాలు తక్కువగా వస్తున్నాయని అసహనం వ్యక్తం చేయడం అతను ముంబై వీడుతున్నాడనే వార్తలకు బలం చేకూర్చుతోంది. రోహిత్ శర్మ అనంతరం టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించాలనే లక్ష్యంతో బుమ్రా ఉన్నట్లు ఈ ఇంటర్వ్యూలో స్పష్టమైంది.
పేస్ బౌలర్లు కెప్టెన్గా సక్సెస్ సాధించారని బుమ్రా చెప్పుకొచ్చాడు. కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్ సారథులుగా ప్రపంచకప్ గెలిచారని, ఆస్ట్రేలియా సారథి ప్యాట్ కమిన్స్ కూడా ప్రపంచకప్ సాధించాడని గుర్తు చేశాడు. బుమ్రా వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా.. టీమిండియా సారథ్య బాధ్యతలను స్వీకరించాలనే లక్ష్యంతో బుమ్రా ఉన్నాడనే విషయం స్పష్టమైంది.
ఈ క్రమంలోనే ఐపీఎల్లో ఏదైనా జట్టుకు సారథిగా వ్యవహరించి.. టీమిండియా పగ్గాలు చేపట్టేందుకు తాను సిద్దంగా ఉన్నానని సెలెక్టర్లు తెలియజేయాలని బుమ్రా భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆర్సీబీలోకి వెళ్లేందుకు బుమ్రా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆ జట్టుకు కెప్టెన్ లేడు. కోహ్లీ అనంతరం ఆర్సీబీ సారథ్య బాధ్యతలు చేపట్టిన ఫాఫ్ డుప్లెసిస్ను అతని వయసు దృష్ట్యా రిటైన్ చేసుకునే అవకాశం లేదు.
అవసరమైతే ట్రేడింగ్ విండో ద్వారా లేకుంటే వేలంలో బుమ్రాను తీసుకోవాలని ఆర్సీబీ భావిస్తున్నట్లు సమాచారం. బుమ్రా మాత్రం కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చే జట్టులోకి వెళ్లేందుకే ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.