ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ మరో విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 42 పరుగుల తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్లో ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్తో చెలరేగగా.. బౌలింగ్లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ మలింగా నిప్పులు చెరిగి సన్రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ ఓటమితో ఆర్సీబీ టాప్-2లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 94 నాటౌట్), అభిషేక్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో రోమారియో షెపర్డ్(2/14) రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, సుయాష్ శర్మ, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటైంది. ఫిల్ సాల్ట్(32 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లతో 62), విరాట్ కోహ్లీ(25 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 43)టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ప్యాట్ కమిన్స్(3/28) మూడు వికెట్లు తీయగా.. ఇషాన్ మలింగా(2/37) రెండు వికెట్లు పడగొట్టాడు. జయదేవ్ ఉనాద్కత్, హర్ష్ దూబే, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

అదిరిపోయే ఆరంభం..
భారీ లక్ష్యచేధనలో ఆర్సీబీకి ఆశించిన శుభారంభం దక్కింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ దూకుడుగా తమ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఆరంభంలో కాస్త ఇబ్బంది పడిన ఫిల్ సాల్ట్ ఆ తర్వాత చెలరేగాడు. దాంతో ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 72 పరుగులు చేసింది. ఆ వెంటనే హర్ష్ దూబే బౌలింగ్కు రాగా విరాట్ కోహ్లీ క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో తొలి వికెట్కు నమోదైన 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. మరోవైపు ఫిల్ సాల్ట్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దేవదత్ పడిక్కల్ స్థానంలో జట్టులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్(11) తీవ్రంగా నిరాశపరిచాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్లో కీపర్ క్యాచ్గా వెనుదిరిగాడు. జితేశ్ శర్మ వచ్చి రావడంతో భారీ సిక్స్లు బాదగా.. రజత్ పటీదార్ అతనికి అండగా నిలిచాడు.
మలుపు తిప్పిన నితీష్, ఇషాన్
14 ఓవర్లలోనే 163 పరుగులు చేయడంతో ఆర్సీబీ విజయం లాంఛనమేనని అంతా అనుకున్నారు. కానీ 15వ ఓవర్ వేసిన నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులే ఇచ్చి ఆర్సీబీ బ్యాటర్లపై ఒత్తిడి తెచ్చాడు. దాంతో ఇషాన్ మలింగా వేసిన మరుసటి ఓవర్లో ఆర్సీబీ రెండు వికెట్లు కోల్పోయింది. రజత్ పటీదార్ అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటవ్వగా.. డేంజరస్ రొమారియో షెపెర్డ్ గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. దాంతో ఆర్సీబీ మరింత ఒత్తిడికి గురైంది. చేధించాల్సిన రన్రేట్ పెరిగిపోవడంతో భారీ షాట్లకు ప్రయత్నించి వరుసగా పెవిలియన్ చేరారు. జితేశ్ శర్మ(24)ను ఉనాద్కత్ ఔట్ చేయగా.. టీమ్ డెవిడ్ను ఇషాన్ మలింగా, భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యాలను కమిన్స్ ఔట్ చేశాడు. యశ్ దయాల్ను హర్షల్ పటేల్ పెవిలియన్ చేర్చి ఆర్సీబీ ఇన్నింగ్స్కు తెరదించాడు.