ఐపీఎల్ గవర్నింగ్ బాడీ మీటింగ్ నేపథ్యంలో లీగ్లోని పది ఫ్రాంచైజీలు బీసీసీఐకి కీలక విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది. ఈ కీలక మీటింగ్కు ముందు పది ఫ్రాంచైజీల ఓనర్లతో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం(జూలై 31) ముంబైలో ఓ సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ మీటింగ్లో ఐపీఎల్ 2025 నిర్వహణ, మెగా వేలానికి సంబంధించి ఫ్రాంచైజీలతో చర్చించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సమావేశానికి సంబంధించి బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఓ ప్రముఖ క్రికెట్ వెబ్సైట్ మాత్రం.. ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించి బీసీసీఐ అధికారులు.. ఫ్రాంచైజీ ఓనర్లతో మాట్లాడినట్లు పేర్కొంది. ఈ కథనం ప్రకారం ఫ్రాంచైజీ ఓనర్లు మెగా వేలానికి సంబంధించి అనేక విజ్ఞప్తులు చేసినట్లు తెలుస్తోంది.

ఆటగాళ్ల పర్స్ వాల్యూ 120 కోట్లకు పెంచడంతో పాటు రిటైన్ చేసుకునే ఆటగాళ్ల సంఖ్యను 6-8 వరకు పెంచాలని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా వేలం ముగిసిన తర్వాత సరైన కారణం లేకుండా చివర్లో జట్టు నుంచి తప్పుకునే ఓవర్సీస్ ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
కొందరు ఓవర్సీస్ ఆటగాళ్లు తెలివిగా.. మెగా వేలానికి దూరంగా ఉంటూ మినీ వేలాల్లో పాల్గొని ఎక్కువ డబ్బులు ఆర్జిస్తున్నారని, అలాంటి వారికి అడ్డు కట్ట వేయాలని బీసీసీఐని కోరినట్లు సమాచారం. అంతేకాకుండా వేలంలో ఆశించిన ధర దక్కలేదని, టోర్నీకి దూరమయ్యే ఆటగాళ్లపై కూడా చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించాలని బీసీసీఐకి ఫ్రాంచైజీలు సూచించినట్లు తెలుస్తోంది.
చివరి నిమిషంలో ఆటగాళ్లు తప్పుకోవడం ఫ్రాంచైజీలకు పెద్ద సమస్య అవుతోంది. గాయాలు, సహేతుకమైన కారణాలతో దూరమైతే పర్వాలేదని, కానీ ఉద్దేశపూర్వకంగా తప్పుకుంటే మాత్రం చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజీ ఓనర్లు బీసీసీఐకి సూచించినట్లు సమాచారం. ఈసారి బీసీసీఐ కూడా ఓవర్సీస్ ఆటగాళ్ల విషయంలో ఓ కొత్త పాలసీని రూపొందించే అవకాశం ఉంది.
స్వదేశీ ఆటగాళ్ల కంటే విదేశీ ప్లేయర్లకు ఎక్కువ ధర పలకుతుండటంపై మాజీ క్రికెటర్లు, భారత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ ఓ కొత్త పాలసీని తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. ఇంపాక్ట్ రూల్ కొనసాగించడంపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ రూల్ కారణంగా ఆల్రౌండర్లకు సరైన గుర్తింపు లేకుండా పోతుందని రోహిత్, కోహ్లీ వంటి ఆటగాళ్లు అభిప్రాయపడిన విషయం తెలిసిందే.