వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో జట్టు దక్కించుకోవాలనుకున్న భారత ప్రముఖ వ్యాపారావేత్త గౌతమ్ అదానీకి మరోసారి నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్ నియంత్రణ వాటాను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసిన అదానీ గ్రూప్ చివరి నిమిషంలో ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గుజరాత్ టైటాన్స్ ఓనర్స్ అయిన సీవీసీ క్యాపిటల్తో అదానీ గ్రూప్, టొరెంట్ గ్రూప్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ భాగస్వామ్యం కోసం చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి. సీవీసీ క్యాపిటల్కు చెందిన గుజరాత్ టైటాన్స్ జట్టులో మెజారిటీ వాటాను విక్రయించి మైనారిటీ హోల్డింగ్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు బిజినెస్ సైట్స్ పేర్కొన్నాయి.

అయితే కొత్త జట్లు వాటాలు విక్రయించకుండా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిరోధించే లాక్-ఇన్ పీరియడ్ 2025 ఫిబ్రవరితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్పై అదానీ గ్రూప్ కన్నేసినట్లు వార్తలు బయటకి వచ్చాయి. ప్రస్తుతం గుజరాత్ టైటాన్స్ విలువ రూ. 8,390 కోట్లుగా ఉండవచ్చు.
ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు బీసీసీఐ కొత్తగా రెండు జట్లకు అవకాశం ఇవ్వగా.. సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్ రూ.5,625 కోట్లతో గుజరాత్ టైటాన్స్ జట్టును దక్కించుకుంది. ఏడు వేల కోట్లకు సంజీవ్ గోయెంకా లక్నో సూపర్ జెయింట్స్ను దక్కించుకున్నాడు. అప్పుడు కూడా టెండర్ వేసిన ఆదానీ గ్రూప్.. రూ. 4,653 కోట్లు మాత్రమే కోట్ చేసింది. దాంతో గుజరాత్ టైటాన్స్ సీవీసీ క్యాపిటల్స్ వశమైంది.
ఈ క్రమంలోనే ఆ జట్టులోని మెజార్టీ వాటాను కొనుగోలు చేసేందుకు ఆదానీ గ్రూప్ సిద్దమైనట్లు వార్తలు వచ్చాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ.. అదానీ గ్రూప్ ఈ డీల్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. దాంతో టోరెంటో కంపెనీ.. సీవీసీ క్యాపిటల్స్ షేర్స్ను కొనుగోలు చేసినట్లు సమాచారం. అదానీ గ్రూప్ వెనక్కి తగ్గడానికి గల కారణాలు తెలియరాలేదు.
క్రికెట్లో పెట్టుబడి పెట్టడం అనేది అదానీకి కొత్తేమీ కాదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్), యూఏఈ ఇంటర్నేషనల్ లీగ్ టీ20ల్లో అదానీ గ్రూప్ జట్లను కొనుగోలు చేసింది. డబ్ల్యూపీఎల్ గుజరాత్కు చెందిన జట్టునే దక్కించుకుంది. 2023 లో డబ్ల్యూపీఎల్ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని రూ .1,289 కోట్ల టాప్ బిడ్తో సొంతం చేసుకుంది.