రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను ఔట్ చేసినందుకు తనను విరాట్ కోహ్లీ అభినందించాడని రాజస్థాన్ రాయల్స్ యువ పేసర్ కుమార్ కార్తీకేయ తెలిపాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.

అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ ఒక్కడే వికెట్ తీసాడు.
అయితే ఈ మ్యాచ్లో ఫిల్ సాల్ట్ ఔట్ చేసిన అనంతరం కుమార్ కార్తీకేయను కోహ్లీ అభినందించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. మ్యాచ్ అనంతరం ఈ ఘటనపై కుమార్ కార్తీకేయను ప్రశ్నించగా.. అసలు విషయం చెప్పాడు. కొంచెం అయితే కోహ్లీతో గొడవయ్యేదని చెప్పాడు.
'నా బౌలింగ్లో ఫిల్ సాల్ట్ సిక్స్ కొట్టినప్పుడు విరాట్ కోహ్లీ 'కమ్ ఆన్'అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఇద్దరం ఒకరినొకరం చూసుకున్నాం. నేను సైలెంట్గా ఉండిపోయాను. అయితే ఫిల్ సాల్ట్ను ఔట్ చేసిన అనంతరం నేను కూడా గట్టిగా 'కమ్ ఆన్'అని అరుస్తూ సంబరాలు చేసుకున్నాను. ఆ మాటకు విరాట్ భయ్యా నావైపు తిరిగి అలానే చూశాడు. వెంటనే నేను మీ గురించి కాదని చెప్పాను. ఆ తర్వాత కోహ్లీ నా దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి అద్భుతంగా బౌలింగ్ చేశావ్ అని మెచ్చుకున్నాడు.'అని కుమార్ కార్తీకేయ చెప్పుకొచ్చాడు. ఈ వీడియోను రాజస్థాన్ రాయల్స్.. సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.