ఐపీఎల్ 2025 సీజన్లో వరుస విజయాలతో జోరు కనబర్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి సన్రైజర్స్ హైదరాబాద్ ఊహించని షాకిచ్చింది. లక్నో వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ఆరెంజ్ ఆర్మీ 42 పరుగుల తేడాతో ఆర్సీబీని చిత్తు చేసింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్లతో 94 నాటౌట్), అభిషేక్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లతో 34) రాణించారు. అనంతరం ఆర్సీబీ 19.5 ఓవర్లలో 189 పరుగులకు ఆలౌటై ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.
మూడో స్థానానికి ఆర్సీబీ..
ఈ ఓటమితో ఆర్సీబీ టాప్-2లో నిలిచే అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. తాజా పరాజయంతో ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో మూడో స్థానానికి పడిపోయింది. 42 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలవ్వడంతో రన్రేట్ బాగా తగ్గింది. దాంతో 17 పాయింట్లు ఉన్నా మూడో స్థానానికి పడిపోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆర్సీబీ 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, ఒక మ్యాచ్ రద్దుతో 17 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే ఆఖరి మ్యాచ్లో ఆర్సీబీ విజయం సాధించినా.. టాప్-2లో నిలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఆర్సీబీ టాప్-2లో నిలవాలంటే..?
ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్సీబీ టాప్-2లో నిలవాలంటే లక్నో సూపర్ జెయింట్స్తో జరిగే ఆఖరి మ్యాచ్లో భారీ విజయాన్నందుకోవాలి. అదే సమయంలో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓటమిపాలవ్వాలి. పంజాబ్ కింగ్స్ తమ చివరి రెండు మ్యాచ్లకు రెండు ఓడాలి. అప్పుడే పంజాబ్ 17, ముంబై 16 పాయింట్లకు పరిమితమవుతాయి. అప్పుడు ఆర్సీబీ 19 పాయింట్లతో టాప్-2లో నిలుస్తోంది. ఆఖరి మ్యాచ్ కూడా ఓడితే.. గుజరాత్, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడిపోతేనే ఆర్సీబీ టాప్-2 ప్లేస్ ఖరారవుతోంది.
టాప్-2లో నిలిస్తే..
ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ ప్రకారం టాప్-2లో నిలిచిన జట్లు క్వాలిఫయర్-1 మ్యాచ్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ మ్యాచ్ ఆడనుండగా.. ఓడిన జట్టు క్వాలిఫయర్-2 ఆడనుంది. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ ఆడుతాయి. ఇందులో గెలిచిన జట్టు క్వాలిఫయర్-2 ఆడుతోంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్కు అర్హత సాధిస్తోంది. టాప్-2లో నిలిచిన జట్టుకు ఓడినా మరో అవకాశం లభిస్తుంది. అందుకే జట్లన్నీ టాప్-2లో నిలిచేందుకు ప్రాధాన్యత ఇస్తాయి.