రజత్ పటీదార్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. ఐపీఎల్లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్గా రజత్ పటీదార్ ఎంపికవ్వడమే ఇందుకు కారణం. రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్, కెవిన్ పీటర్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సారథ్యం వహించిన జట్టుకు యువ ప్లేయర్ అయిన రజత్ పటీదార్ కెప్టెన్గా ఎంపికవ్వడమే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి కలిగిస్తోంది.
మూడేళ్ల క్రితం అన్సోల్డ్గా నిలిచిన రజత్ పటీదార్.. ఇప్పుడు వరల్డ్ బెస్ట్ క్రికెట్ ఫ్రాంచైజీ అయిన ఆర్సీబీ పగ్గాలు అందుకున్నాడు. ఈ మూడేళ్లలో తన ఆటలో వచ్చిన మార్పే అతన్ని ఆర్సీబీ సింహాసనంపై కూర్చోబెట్టింది. ఐపీఎల్ 2021 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి అరంగేట్రం చేసిన రజత్ పటీదార్.. మూడేళ్ల వ్యవధిలోనే కెప్టెన్గా ఎదిగాడు. ఇందులో గాయంతో ఓ సీజన్ ఆడనేలేదు.

అన్సోల్డ్గా నిలిచి
ఐపీఎల్ 2021లో ఆర్సీబీ తరఫున అరంగేట్రం చేసిన రజత్ పటీదార్.. 4 మ్యాచ్లు ఆడి 71 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ పేలవ ప్రదర్శనతో ఆర్సీబీ తర్వాతి సీజన్కే అతన్ని వేలంలోకి వదిలేసింది. ఐపీఎల్ 2022 వేలంలో అతన్ని ఏ జట్టు కూడా కొనుగోలు చేయలేదు. దాంతో అన్సోల్డ్గా నిలిచాడు. అయితే ఐపీఎల్ 2022 సీజన్ ముంగిట ఆర్సీబీ తీసుకున్న అనామక ప్లేయర్ లవ్నీత్ సిసోడియా గాయపడటంతో అతని స్థానంలో అనూహ్యంగా రజత్ పటీదార్ జట్టులోకి వచ్చాడు.
ఆ సెంచరీతో మారిన రజత్ ఫేట్ ..
ప్రాక్టీస్ మ్యాచ్ల్లో మెరుగైన ప్రదర్శన చేయడంతో అతనికి ఆర్సీబీ మేనేజ్మెంట్ తుది జట్టులో చోటిచ్చింది. రూ. 20 లక్షల కనీస ధరతోనే జట్టులోకి వచ్చిన అతను ఆ సీజన్లో 8 మ్యాచ్ల్లో 55.50 సగటుతో 333 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలతో పాటు ఓ శతకం సాధించాడు. అది కూడా లక్నో సూపర్ జెయింట్స్తో ఎలిమినేటర్ మ్యాచ్లో 54 బంతుల్లో 112 పరుగులతో అజేయంగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్లో సెంచరీ చేసిన తొలి అనామక ప్లేయర్గా చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ పటీదార్ తలరాతను మార్చేసింది. కానీ గాయం కారణంగా తర్వాతి ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.
రూ. 20 లక్షల నుంచి రూ. 11 కోట్లకు
అతనిపై నమ్మకం ఉంచిన ఆర్సీబీ అండగా నిలిచింది. ఐపీఎల్ 2024 సీజన్లో రీఎంట్రీ ఇచ్చిన అతను 15 మ్యాచ్ల్లో 5 హాఫ్ సెంచరీలతో 395 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శనతో ఆర్సీబీ అతన్ని రూ. 11 కోట్ల భారీ ధరకు రిటైన్ చేసుకుంది. గత సీజన్ వరకు జట్టును నడిపించిన ఫాఫ్ డుప్లెసిస్ను వదిలేయడంతో తమ సారథిగా రజత్ పటీదార్ను నియమించింది.
గాయపడిన ఆటగాడికి రిప్లేస్మెంట్గా రూ. 20 లక్షల కనీస ధరతో జట్టులోకి వచ్చిన రజత్ పటీదార్.. మెరుగైన ప్రదర్శనతో రూ. 11 కోట్ల ధరను అందుకోవడంతో పాటు ఇప్పుడు ఏకంగా ఆర్సీబీ సింహాసనంపైనే కూర్చున్నాడు. రజత్ పటీదార్ ఐపీఎల్ ప్రయాణాన్ని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. 'లక్ అంటే నీదే కాక.. అన్సోల్డ్గా నిలిచి కెప్టెన్ అయ్యావ్!'అని కామెంట్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ సూచనలతోనే ఆర్సీబీ రజత్ పటీదార్ను కెప్టెన్గా నియమించినట్లు తెలుస్తోంది.