ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆ జట్టు ఆరో ఓటమిని మూటగట్టుకుంది. ముంబై ఇండియన్స్తో ఆదివారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ధోనీ సేన.. 9 వికెట్ల తేడాతో చిత్తయ్యింది. ముందుగా బ్యాటింగ్లో తేలిపోయిన డాడీస్ ఆర్మీ.. ఆ తర్వాత బౌలింగ్లో చేతులెత్తేసింది. మరోవైపు రోహిత్ శర్మ(45 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్లతో 76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్(30 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్లతో 68 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో ముంబై ఇండియన్స్ ఘన విజయాన్నందుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 176 పరుగులే చేసింది. రవీంద్ర జడేజా(35 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 53 నాటౌట్), శివమ్ దూబే(32 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్లతో 50) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా(2/25) రెండు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్, అశ్వని కుమార్, మిచెల్ సాంట్నర్ తలో వికెట్ తీసారు. అనంతరం ముంబై ఇండియన్స్ 15.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 177 పరుగులు చేసి గెలుపొందింది. ఈ పరాజయంతో చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది.

సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఈ ఓటమితో సీఎస్కే పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన ధోనీ సేన.. రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. రన్ రేట్ కూడా నెగటీవ్(-1.392)గానే ఉంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఇంకా 6 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 6 మ్యాచ్లకు 6 విజయం సాధిస్తేనే సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరుతోంది. ఒక్క మ్యాచ్ ఓడితే ఇతర జట్ల ఫలితాలు, రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది.
ఒకవేళ రెండు మ్యాచ్లు ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్లను సన్రైజర్స్ హైదరాబాద్(ఏప్రిల్ 25), పంజాబ్ కింగ్స్(ఏప్రిల్ 30), ఆర్సీబీ(మే3), కేకేఆర్(మే7), రాజస్థాన్ రాయల్స్(మే12), గుజరాత్ టైటాన్స్(మే18)తో తలపడనుంది. ఇందులో మూడు మ్యాచ్లు చెన్నై వేదికగానే జరగనున్నాయి.