ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. ఆ జట్టు ఏడో ఓటమిని మూటగట్టుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్తో శుక్రవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ధోనీ సేన.. 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చెపాక్ మైదానంలో సీఎస్కేకు ఇది వరుసగా నాలుగో పరాజయం. ఐపీఎల్ చరిత్రలోనే సీఎస్కే సొంతగడ్డపై వరుసగా నాలుగు మ్యాచ్లు ఓడటం ఇదే తొలిసారి. ముందుగా బ్యాటింగ్లో తేలిపోయిన డాడీస్ ఆర్మీ.. ఆ తర్వాత బౌలింగ్లో పోరాడినా ఫలితం లేకపోయింది.
పేలవ బ్యాటింగ్తో..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 19.4 ఓవర్లలో 154 పరుగులకే ఆలౌటైంది. డెవాల్డ్ బ్రెవిస్(25 బంతుల్లో ఫోర్, 4 సిక్స్లతో 42), ఆయుష్ మాత్రే(19 బంతుల్లో 6 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు. సన్రైజర్స్ బౌలర్లలో హర్షల్ పటేల్(4/28) నాలుగు వికెట్లతో సీఎస్కే పతనాన్ని శాసించాడు. ప్యాట్ కమిన్స్, జయదేవ్ ఉనాద్కత్ రెండేసి వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, కామిందు మెండీస్ తలో వికెట్ తీసారు.

అనంతరం సన్రైజర్స్ హైదరాబాద్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 155 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్(34 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 44), కామిందు మెండీస్(22 బంతుల్లో 3 ఫోర్లతో 32 నాటౌట్) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్(2/42) రెండు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్, రవీంద్ర జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే దాదాపుగా తప్పుకుంది.
సీఎస్కే ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఈ ఓటమితో సీఎస్కే పాయింట్స్ టేబుల్లో 10వ స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచ్లు ఆడిన ధోనీ సేన.. రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. రన్ రేట్ కూడా నెగటీవ్(-1.302)గానే ఉంది. ఈ టోర్నీలో ఆ జట్టు ఇంకా 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 5 మ్యాచ్లకు ఐదు విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చేరలేని పరిస్థితిని తెచ్చుకుంది. ఐదుకు ఐదు మ్యాచ్లు గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలు, రన్రేట్పై ఆధారపడాల్సి ఉంటుంది. మరో మ్యాచ్లో ఓడితే మాత్రం అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తోంది.
చెన్నై సూపర్ కింగ్స్ తమ తదుపరి మ్యాచ్లను పంజాబ్ కింగ్స్(ఏప్రిల్ 30), ఆర్సీబీ(మే3), కేకేఆర్(మే7), రాజస్థాన్ రాయల్స్(మే12), గుజరాత్ టైటాన్స్(మే18)తో తలపడనుంది. ఇందులో మూడు మ్యాచ్లు చెన్నై వేదికగానే జరగనున్నాయి.