ఐపీఎల్ 2025 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ దుమ్మురేపుతోంది. రిషభ్ పంత్ కెప్టెన్సీలో వరుస విజయాలతో దూసుకెళ్తోంది. 8 మ్యాచ్ల్లో 5 గెలిచి పాయింట్స్ టేబుల్లో టాప్-4 కొనసాగుతోంది. గత 5 మ్యాచ్ల్లో లక్నో నాలుగు గెలవడం విశేషం. రాజస్థాన్ రాయల్స్తో శనివారం జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ చిరస్మరణీయ విజయాన్నందుకుంది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో 2 పరుగుల తేడాతో గెలుపొందింది.
రిషభ్ పంత్ అద్భుతమైన కెప్టెన్సీతో లక్నోకు వరుస విజయాలు అందుతున్నాయి. అయితే అతని వ్యక్తిగత ప్రదర్శన మాత్రం ఆందోళన కలిగిస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషభ్ పంత్ నిలిచాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో సూపర్ జెయింట్స్ రిషభ్ పంత్ను కొనుగోలు చేసింది. విధ్వంసకర బ్యాటింగ్తో పాటు కెప్టెన్గా రాణించగలడనే నమ్మకంతో అతనిపై కోట్ల వర్షం కురిపించింది. ఆ స్టార్డమ్ కూడా జట్టుకు కలిసొస్తుందని ఆశించింది.

అతని కెప్టెన్సీలో ఏ లోటు లేకున్నా.. బ్యాట్ నుంచే పరుగులు రావడం లేదు. అదే ఇప్పుడు జట్టుకు సమస్యగా మారింది. ఐపీఎల్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో రిషభ్ పంత్ టాప్-10లో ఉంటాడు. ఇప్పటి వరకు 198 ఇన్నింగ్స్లు ఆడిన అతను 5128 పరుగులు చేశాడు. అతని యావరేజ్ 31కాగా.. స్ట్రైక్రేట్ 143.
అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న రిషభ్ పంత్.. ఈ ఏడాది పూర్తిగా తేలిపోయాడు. ఇప్పటి వరకు ఆడిన 7 ఇన్నింగ్స్లో ఒకే ఒక్క మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించాడు. వరుసగా 0, 15, 2, 2, 21, 63, 3లతో మొత్తం 106 పరుగులే చేశాడు. ఈ ఏడాది అతని బ్యాటింగ్ సగటు 15.14గా ఉండగా.. స్ట్రైక్రేట్ 98.14 మాత్రమే. అతని బ్యాటింగ్ పరమ చెత్తగా సాగుతోంది. ఇప్పుడు ఇదే అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ సీజన్లో లక్నో ప్లే ఆఫ్స్ చేరితే ఏ సమస్య ఉండదు కానీ.. లేకపోతే వచ్చే సీజన్కు అతన్ని జట్టు నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది.