అప్కమింగ్ ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ సారథిగా మళ్లీ స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యానే కొనసాగనున్నాడు. పేలవ ఫామ్తో పాటు టీమిండియా టీ20 సారథ్య బాధ్యతలు కోల్పోయి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకే జట్టు పగ్గాలు అందించేందుకు ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.
గతేడాదే ప్లేయర్ ట్రాన్స్ఫర్ విండో ద్వారా గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్లోకి వచ్చిన హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ నుంచి సారథ్య బాధ్యతలు అందుకున్నాడు. అయితే ఈ నిర్ణయం ఆ జట్టు అభిమానులకు నచ్చలేదు. దాంతో మ్యాచ్ల సందర్భంగా హార్దిక్ పాండ్యాను తీవ్రంగా గేలి చేశారు. జట్టులోని ఆటగాళ్లు కూడా అతనికి సహకరించలేదనే వార్తలు వచ్చాయి.

బలంగా ముంబై ఇండియన్స్..
ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ గత సీజన్లో దారుణంగా విఫలమైంది. 14 మ్యాచ్లకు 4 మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది. ఈ పేలవ ప్రదర్శన నేపథ్యంలో హార్దిక్ పాండ్యాను జట్టు నుంచి తప్పిస్తారని ప్రచారం జరిగింది. మరోవైపు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలు ముంబై ఇండియన్స్ జట్టు వీడుతాడని కథనాలు వచ్చాయి. కానీ ముంబై ఇండియన్స్ ఈ నలుగురు స్టార్ ఆటగాళ్లతో పాటు హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మను రిటైన్ చేసుకుంది.
మెగా వేలంలో ఈ ఐదుగురు ఆటగాళ్లతో కూడిన కోర్ టీమ్కు తగ్గట్లు మిగతా ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ప్రస్తుతం ఆన్పేపర్పై ముంబై ఇండియన్స్ బలంగా కనిపిస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో కెప్టెన్గా.. ఆటగాడిగా దారుణంగా విఫలమైన హార్దిక్ పాండ్యా.. టీ20 ప్రపంచకప్లో మెరుగైన ప్రదర్శన చేశాడు. అటు బ్యాట్తో పాటు బంతితోను రాణించాడు. దాంతో భారత్ 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 ప్రపంచకప్ గెలిచింది.
హార్ధిక్పై వేటు..
అయితే ఈ టోర్నీ ముగిసిన తర్వాత టీమిండియాలో పరిస్థితులన్నీ మారిపోయాయి. హెడ్ కోచ్ మారడంతో పాటు లీడర్షిప్ గ్రూప్ను కూడా మార్చారు. రోహిత్ శర్మకు బ్యాకప్గా టీ20 సారథిగా కొనసాగిన హార్దిక్ పాండ్యాపై వేటు వేసి సూర్యకుమార్ యాదవ్కు ఆ బాధ్యతలు అప్పగించారు. ఫిట్నెస్ సమస్యలతో బాధపడే హార్దిక్ పాండ్యా అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉండలేడనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
అయితే ఈ నిర్ణయం వెనుక చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. సూర్యను కెప్టెన్ చేయకపోతే తాను ఛీప్ సెలెక్టర్ పదవిని వదిలేస్తానని బెదిరింపులకు దిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్ చివరి దశలో ఉంది. ముంబై ఇండియన్స్ సారథిగా ఐపీఎల్ 2025 సీజన్లో హార్దిక్ పాండ్యా సత్తా చాటితే అతనికి మళ్లీ టీమిండియా పగ్గాలను అందుకునే అవకాశం దక్కుతుంది.
గతంలో హార్దిక్ పాండ్యా ఇలాంటి పరిస్థితుల నుంచి అద్భుతంగా పుంజుకున్నాడు. విమర్శకులకు తన ఆటతోనే బదులిచ్చాడు. అతని సామర్థ్యంపై నమ్మకంతో ఉన్న ముంబై ఇండియన్స్ మళ్లీ హార్దిక్కే సారథ్య బాధ్యతలు అప్పగించేందకు సిద్దమవుతోంది.