జస్ప్రీత్ బుమ్రా అసాధారణ ప్రదర్శనతోనే ఓడిపోయే మ్యాచ్లో విజయం సాధించామని ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు. క్లిష్ట సమయంలో జట్టును ఆదుకునేందుకు బుమ్రా సిద్దంగా ఉంటాడని చెప్పాడు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా శుక్రవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ను ఓడించింది. ఈ విజయంతో ఆదివారం అహ్మదాబాద్ వేదికగా జరిగే క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్తో ముంబై ఇండియన్స్ తలపడనుంది.
ఎలిమినేటర్ విజయానంతరం మాట్లాడిన హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రాతో పాటు రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టోలపై ప్రశంసల జల్లు కురిపించాడు. 'ఒకానొక దశలో మ్యాచ్ చేజారినట్లు అనిపించింది. రెండో ఇన్నింగ్స్ డ్యూ కారణంగా పిచ్ బ్యాటింగ్కు అనుకూలంగా మారింది. బంతి సునాయసంగా బ్యాట్పైకి వచ్చింది. గుజరాత్ బ్యాటర్లు సైతం మంచి రిథమ్ అందుకున్నారు. మేం ఒత్తిడికి లోనవ్వకుండా మా ఆటగాళ్లకు అండగా నిలవాలనే విషయాన్ని గ్రహించాం.

జానీ బెయిర్ స్టో ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు అద్భుతం. మా కోసం అతను తొలి మ్యాచ్లోనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. కాస్త సమయం తీసుకున్నా రోహిత్ సైతం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బౌలింగ్లో గ్లీసన్, బుమ్రా, అశ్విన్ కుమార్ ప్రతీ ఒక్కరూ రాణించారు. మేం ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు. నేను మరో రెండు భారీ సిక్స్లు కొట్టాలనుకున్నాను. ఎందుకంటే చివర్లో చేసే పరుగులు చాలా కీలకంగా మారుతాయి. బ్యాటింగ్లో మేం అనుకున్న విధంగా దూకుడుగా ఆడాం.
మ్యాచ్ చేజారిపోతుందని అనిపిచ్చినప్పుడు బుమ్రాతో బౌలింగ్ చేయించాలి. బుమ్రా జట్టులో ఉండటం ఒక లగ్గరి. ముంబై జట్టులోనే అతను అత్యంత ఖరీదైన ఆటగాడు. చివర్లో అదనపు పరుగులు ఉంచగలిగితే వాటిని డిఫెండ్ చేయగల బౌలర్లను ఉన్నారని నేను భావించాను. దాంతోనే 18వ ఓవర్ను బుమ్రాతో వేయించాను. ఆ ఓవర్ను బుమ్రా కట్టడిగా వేయడంతో చేయాల్సిన రన్రేట్ పెరిగింది. దాంతో ఇతర బౌలర్ల పని సులువైంది. ఈ తరహా మ్యాచ్ల్లో పుంజుకోవడం చాలా కీలకం. తదుపరి మ్యాచ్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం.'అని హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 228 పరుగులు చేసింది. అనంతరం గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులే చేసి ఓటమిపాలైంది.