ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహచర ఆటగాళ్ల రికార్డులను అడ్డుకోవడం హార్దిక్ పాండ్యాకు ఏం సరదా? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. హార్దిక్ పాండ్యా మరీ ఇంత స్వార్థపరుడని తాము అనుకోలేదని, అతనికి ఎందుకు ఇంత కుళ్లు? అని మండిపడుతున్నారు. ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అయితే ఈ మ్యాచ్తో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన అశ్వని కుమార్ సంచలన ప్రదర్శన చేశాడు. అరంగేట్ర మ్యాచ్లోనే అత్యధిక వికెట్లు తీసిన తొలి భారత బౌలర్గా చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్లో అతను 3 ఓవర్లు వేసి 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అతని ధాటికి అజింక్యా రహానేతో పాటు రింకూ సింగ్, మనీష్ పాండే, ఆండ్రీ రస్సెల్ పెవిలియన్ చేరారు.

మరో ఓవర్ ఇవ్వని హార్దిక్..
మంచి రిథమ్లో బౌలింగ్ చేసిన అశ్వని కుమార్కు హార్దిక్ పాండ్యా మరో ఓవర్ ఇవ్వలేదు. అతను 13వ ఓవర్లో చివరిసారిగా బౌలింగ్ చేయగా.. కేకేఆర్ ఇన్నింగ్స్ 16.2 ఓవర్లలో ముగిసింది. తర్వాతి నాలుగు ఓవర్లలో ఒక్క ఓవర్ బౌలింగ్ ఇచ్చినా అశ్వని కుమార్కు ఐదు వికెట్ల ఘనత దక్కేది. తద్వారా అరంగేట్ర ఐపీఎల్ మ్యాచ్లోనే ఐదు వికెట్లు తీసిన ఘనత అతని సొంతమయ్యేది. కానీ హార్దిక్ పాండ్యా అశ్వని కుమార్కు కాకుండా.. మిచెల్ సాంట్నర్, విజ్ఞేష్ పుతుర్తో బౌలింగ్ చేయించాడు. వారు చెరో వికెట్ తీసి కేకేఆర్ ఇన్నింగ్స్కు తెరదించారు. అశ్విని కుమార్కు మరో ఓవర్ బౌలింగ్ ఇవ్వకపోవడాన్ని కామెంటేటర్లు కూడా తప్పుబట్టారు. అసలు హార్దిక్ ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.
ఇలానే తిలక్ హాఫ్ సెంచరీని కూడా..
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ హార్దిక్ పాండ్యాపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో తిలక్ వర్మ హాఫ్ సెంచరీని కూడా హార్దిక్ పాండ్యా ఇలానే అడ్డుకున్నాడని గుర్తు చేస్తున్నారు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లోనూ విరాట్ కోహ్లీ సెంచరీకి ఇలానే హార్దిక్ అడ్డుతగిలాడని, భారీ సిక్సర్లతో మ్యాచ్ను ముగించే ప్రయత్నం చేశాడని కామెంట్ చేస్తున్నారు. కామన్సెన్స్ లేకుండా హార్దిక్ పాండ్యా ఇలా ఎందుకు చేస్తాడో అర్థం కావడం లేదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్రైడర్స్ 16.2 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ముంబై ఇండియన్స్ 12.5 ఓవర్లలోనే 2 వికెట్లకు 121 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.