టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోనీకి మాత్రమే నిజమైన అభిమానులు ఉన్నారని, మిగతా ఆటగాళ్ల ఫ్యాన్స్ అంతా పెయిడ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా దుమారం రేగుతోంది. ఓ ఛానెల్ చర్చా కార్యక్రమంలో ఆకాశ్ చోప్రాతో కలిసి మాట్లాడిన హర్భజన్ సింగ్.. 43 ఏళ్ల వయసులో ధోనీ ఐపీఎల్ ఎందుకు ఆడుతున్నాడో వివరించాడు. ఈ క్రమంలో ఇతర ఆటగాళ్ల ఫ్యాన్స్పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు.
మిగతా ఫ్యాన్స్ పెయిడ్..
'ధోనీ ఎన్ని సంవత్సరాలు ఆడాలనుకుంటే అన్ని ఏళ్లు ఆడగలడు. అతను నా జట్టులో ఉంటే నేను వేరే నిర్ణయం తీసుకునేవాడిని. కానీ అభిమానులు.. ధోనీ ఆడాలని కోరుకుంటున్నారు. ధోనికి నిజమైన అభిమానులు ఉన్నారు. మిగతా ఆటగాళ్ల ఫ్యాన్స్ అంతా పెయిడ్. డబ్బులు తీసుకొని సోషల్ మీడియా వేదికగా తమ అభిమానం చూపుతారు. వారి గురించి మాట్లాడటం అనవసరం. వారి గురించి మాట్లాడితే ఈ చర్చ పక్కదారి పడుతుంది.'అని హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు. పక్కనే ఉన్న ఆకాశ్ చోప్రా ఇంత నిజాయితీగా మాట్లాడకూడదని చెప్పాడు. వెంటనే హర్భజన్ సింగ్ ఎవరైనా నిజాయితీగానే ఉండాలని బదులిచ్చాడు.

హర్భజన్ ఆ మ్యాచ్ చూశావా?
ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఫ్యాన్స్.. హర్భజన్ సింగ్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ రంజీ మ్యాచ్కు వచ్చిన జనాలను చూసి ఈ విషయం మాట్లాడాలని కోహ్లీ ఫ్యాన్స్.. హర్భజన్ సింగ్కు చరుకలంటిస్తున్నారు. ధోనీకి ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో.. రోహిత్, కోహ్లీలకు కూడా అంతే స్థాయిలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజుల్లో సెలెబ్రిటీలకు పీఆర్స్ ఉండటం సహజమేనని, ఈ సోషల్ మీడియా కాలంలో పీఆర్స్ లేని ప్రముఖులు లేరని చరుకలంటిస్తున్నారు.
ముంబై, ఆర్సీబీకి ఎక్కడిది క్రేజ్..?
పీఆర్స్ ఉన్నంత మాత్రానా కోహ్లీ, రోహిత్కు నిజమైన అభిమానులు లేరని హర్భజన్ సింగ్ చెప్పడం సరికాదన్నాడు. నిజమైన ఫ్యాన్స్ లేనిదే.. లైఫ్ రిస్క్ చేసి మైదానాల్లోకి వెళ్లి కోహ్లీ, రోహిత్ కాళ్లు మొక్కారా? అని ప్రశ్నిస్తున్నారు. అసలు కోహ్లీ, రోహిత్ శర్మకు నిజమైన ఫ్యాన్స్ లేకుంటే ఆర్సీబీ, ముంబై ఇండియన్స్కు క్రేజ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవాలని ఏది పడితే అది మాట్లాడటం సరికాదని హర్భజన్ సింగ్కు చురకలంటిస్తున్నారు.