ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆరో విజయాన్ని ఖాతాలో వేసుకున్న గుజరాత్ టైటాన్స్.. పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ 39 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ అన్ని విభాగాల్లో ఆధిపత్యం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 198 పరుగులు చేసింది. శుభ్మన్ గిల్(55 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్లతో 90), సాయి సుదర్శన్(36 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 52) హాఫ్ సెంచరీలతో రాణించగా.. జోస్ బట్లర్(23 బంతుల్లో 8 ఫోర్లతో 41 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అనంతరం కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 159 పరుగులే చేసింది. అజింక్యా రహానే(36 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 50) మినహా అంతా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ, వాషింగ్టన్ సుందర్, సాయి కిషోర్ తలో వికెట్ తీయగా.. ప్రసిధ్ కృష్ణ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు.

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ కూడా..
టేబుల్ టాపర్గా కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్.. ఈ సీజన్లో 6 విజయాలు నమోదు చేసిన తొలి జట్టుగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్కే చెందిన సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. 8 మ్యాచ్ల్లో అతను 52.13 సగటు 152.18 స్ట్రైక్రేట్తో 417 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. బౌలర్ల జాబితాలో ప్రసిధ్ కృష్ణ 16 వికెట్లతో పర్పుల్ క్యాప్ హోల్డర్గా కొనసాగుతున్నాడు. అతను 8 మ్యాచ్ల్లో 14.12 యావరేజ్..7.29 ఎకానమీతో 16 వికెట్లు పడగొట్టాడు. అత్యత్తమ ప్రదర్శన 4/41.
బెస్ట్ కెప్టెన్గా గిల్..
శుభ్మన్ గిల్..ఈ సీజన్తో అత్యుత్తమ కెప్టెన్సీ గణంకాలు నమోదు చేశాడు. కెప్టెన్గా అత్యధిక విజయాలు సాధించి.. టేబుల్ టాపర్గా నిలిపాడు. కెప్టెన్గా అత్యధిక పరుగులు చేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్తో మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఐపీఎల్ 2022 సీజన్ నుంచి అత్యధిక విన్నింగ్ పర్సంటేజ్ కలిగిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది. ఈ జాబితాలో గుజరాత్తో పాటు లక్నో, ఆర్సీబీ, కేకేఆర్ ఉన్నాయి.