ఐపీఎల్ 2025 సీజన్లో గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ జోరు కొనసాగుతోంది. నిలకడకు మారు పేరుగా మారిన ఈ తమిళనాడు ప్లేయర్.. లక్నో సూపర్ జెయింట్స్తో జరుగుతున్న మ్యాచ్లో హాఫ్ సెంచరీ సాధించాడు. 37 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్తో 56 పరుగులు చేశాడు. అతనికి తోడుగా కెప్టెన్ శుభ్మన్ గిల్(38 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 60) కూడా హాఫ్ సెంచరీతో రాణించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 180 పరుగులు చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్(2/34), రవి బిష్ణోయ్(2/36) రెండేసి వికెట్లు పడగొట్టారు. దిగ్వేష్ రతి, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.

అదిరిపోయే ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టైటాన్స్కు ఓపెనర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తమదైన క్లాస్ బ్యాటింగ్తో పరుగులు రాబట్టారు. దాంతో పవర్ ప్లేలో గుజరాత్ వికెట్ నష్టపోకుండా 54 పరుగులు చేసింది. పవర్ ప్లే అనంతరం దూకుడుగా ఆడిన ఈ జోడీ.. లక్నో బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. రవి బిష్ణోయ్, మార్క్రమ్ల బౌలింగ్ను చితక్కొట్టింది. దిగ్వేష్ రతీ కాస్త కట్టుదిట్టంగా వేసాడు. అతని బౌలింగ్లోనే క్విక్ సింగిల్ తీసి గిల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దిగ్వేష్ రతీ వేసిన మరుసటి ఓవర్లో సాయి సుదర్శన్ ఇచ్చిన క్యాచ్ను అబ్దుల్ సమద్ నేలపాలు చేశాడు.
తడబడ్డ మిడిలార్డర్..
అదే ఓవర్ ఆఖరి బంతిని స్వీప్ షాట్తో షార్ట్ఫైన్ లెగ్ దిశగా బౌండరీ తరలించిన సాయి 32 బంతుల్లో అర్థ శతకాన్ని అందుకున్నాడు. సాయి సుదర్శన్కు ఇది 10వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ. ఈ సీజన్లో మూడోది. 120 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని ఆవేశ్ ఖాన్ విడదీసాడు. క్యాచ్ ఔట్గా శుభ్మన్ గిల్ను పెవిలియన్ చేర్చాడు. రవి బిష్ణోయ్ వేసిన మరుసటి ఓవర్లో సాయి సుదర్శన్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన వాషింగ్టన్ సుందర్(2), జోస్ బట్లర్(16), రాహుల్ తెవాటియా(0) నిరాశపర్చగా.. షెఫ్రెన్ రూథర్ఫోర్డ్(22)తీవ్రంగా తడబడ్డాడు. దాంతో 200 పరుగులు చేస్తుందనుకున్న గుజరాత్ 180 పరుగులకే పరిమితమైంది.
సాయి సుదర్శన్ ఇప్పటి వరకు 6 మ్యాచ్లు ఆడి వరుసగా 74, 63, 49, 5, 82, 56 పరుగులు చేశాడు. ఈ సీజన్లో నిలకడకు మారు పేరుగా నిలిచిన సాయి సుదర్శన్ను టీమిండియాలోకి తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.