ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్, తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఫిట్నెస్ సాధించాడు. నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ) బెంగళూరులో రిహాబిలిటేషన్ తీసుకున్న నితీష్ కుమార్ రెడ్డి.. ఫిట్నెస్ టెస్ట్ క్లియర్ చేశాడు.
యో-యో టెస్ట్లో 18.1 స్కోర్ నమోదు చేయడంతో ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు బీసీసీఐ మెడికల్ టీమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో నితీష్ కుమార్ రెడ్డి ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో కలవనున్నాడు. ఈ విషయాన్ని బీసీసీఐ, సన్రైజర్స్ హైదరాబాద్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ గౌరవ్ గుప్తా ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నాడు.

ఇంగ్లండ్తో ఐదు టీ20ల సిరీస్లో తొలి మ్యాచ్ అనంతరం నితీష్ కుమార్ రెడ్డి పక్కటెముకల గాయంతో భారత జట్టుకు దూరమయ్యాడు. ఈ సిరీస్ రెండో టీ20కి ముందు అతను ప్రాక్టీస్ సెషన్లో గాయపడ్డాడు. అప్పటి నుంచి బెంగళూరులోని ఎన్సీఏలోనే రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకొని ఐపీఎల్ 2025 సీజన్ ఆడేందుకు సిద్దమయ్యాడు.
గత సీజన్లో నితీష్ కుమార్ రెడ్డి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 13 మ్యాచ్ల్లో 2 హాఫ్ సెంచరీలతో 303 పరుగులు చేశాడు. బ్యాటింగ్ ఆల్రౌండర్ సన్రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్లో మూడు వికెట్లు తీసాడు. ఈ ప్రదర్శనతో ఎమర్జింగ్ ప్లేయర్ రికార్డ్ కూడా అందుకున్నాడు. ఈ ప్రదర్శనతోనే టీమిండియా పిలుపు అందుకొని సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ టీమిండియా తరఫున అరంగేట్రం చేసి అసాధారణ శతకంతో ఆకట్టుకున్నాడు.
ఈ సంచలన ప్రదర్శనతోనే ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు సన్రైజర్స్.. నితీష్ రెడ్డిని రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకుంది. వేలంలోకి వెళ్తే భారీ ధర పలికే అవకాశం ఉన్నా.. తనకు అవకాశం ఇచ్చిన జట్టుకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో నితీష్.. తక్కువ ధర రిటెన్షన్కు ఒప్పుకున్నాడు.
ఐపీఎల్ 2023లోనే సన్రైజర్స్ తరఫున అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఆ సీజన్లో ఎక్కువగా అవకాశాలు రాలేదు. రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అప్కమింగ్ సీజన్లో నితీష్ కుమార్ రెడ్డిపై సన్రైజర్స్ భారీ అంచనాలను పెట్టుకుంది. మార్చి 23న రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా జరిగే తొలి మ్యాచ్తో ఆరెంజ్ ఆర్మీ తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది.