ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందు సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ 2025 సీజన్కు ముందు స్టేడియం మొత్తాన్ని రినోవేట్ చేస్తామని తెలిపింది. స్టేడియం సీటింగ్, బాక్స్, వాష్ రూమ్స్తో పాటు అన్ని సౌకర్యాలను మెరుగుపరుస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గురువారం మీడియాకు తెలియజేశారు.
'ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ సారి 9 మ్యాచ్లు జరగనున్నాయి. 7 లీగ్ మ్యాచ్లతో పాటు రెండు ప్లే ఆఫ్స్ మ్యాచ్లను కూడా కేటాయించారు. ఈ క్రమంలోనే స్టేడియాన్ని రినోవేట్ చేయాలని భావించాం. గతేడాది వన్డే ప్రపంచకప్ ముందే స్టేడియాన్ని పునరుద్దరించాం. స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు మెరుగైన సౌకర్యాలను కల్పించాం. ఈ సారి మరింత గొప్ప అనుభూతిని కలిగేలా స్టేడియాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాం. రాబోయే 15 రోజుల్లోనే వాష్ రూమ్స్తో పాటు బాక్స్, సీటింగ్ పెయింటింగ్ పూర్తి చేస్తాం.

మార్చి 2 నుంచి సన్రైజర్స్ హైదరాబాద్ క్యాంప్ ప్రారంభమవ్వనుంది. సన్రైజర్స్ మేనేజ్మెంట్తో కలిసి హెచ్సీఏ పనిచేస్తోంది. ఇందులో తెలంగాణ పోలీస్ విభాగం కూడా భాగమవ్వనుంది. స్టేడియం భద్రత విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ సూచనలను పాటిస్తాం. 'అని జగన్మోహన్ రావు తెలిపారు.
ప్యాట్ కమిన్స్ సారథ్యంలోని సన్రైజర్స్ హైదరాబాద్ గత సీజన్లో తృటిలో టైటిల్ చేజార్చుకున్న విషయం తెలిసిందే. ఫైనల్లో కోల్కతా నైట్రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ సారైన టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ఉంది. ఐపీఎల్ 2025 సీజన్కు మార్చి 22న తెరలేవనుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్ను మార్చి 23న రాజస్థాన్ రాయల్స్ తో హైదరాబాద్ వేదికగానే ఆడనుంది.
మార్చి 23, మార్చి 27, ఏప్రిల్ 6, ఏప్రిల్ 12, ఏప్రిల్ 23, మే 5, మే10 తేదీల్లో ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు జరగనున్నాయి.