మోస్ట్ సక్సెస్ఫుల్ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్తో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రయాణంముగిసిందని మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందని తాను భావించడం లేదని చెప్పాడు.
ఒకవేళ రిటైన్ చేసుకునేందుకు ముంబై ఇండియన్స్ సిద్దంగా ఉన్నా.. అందుకు రోహిత్ శర్మ ఒప్పుకోడని అభిప్రాయపడ్డాడు. ఇప్పటికే అతనికి చాలా ఫ్రాంచైజీల నుంచి ఆఫర్స్ వస్తున్నాయని తెలిపాడు.

రోహిత్- ముంబై ఖేల్ ఖతమ్
'రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లో కొనసాగుతాడా? వీడుతాడా? అనేది పెద్ద ప్రశ్నగా మారింది. నా అభిప్రాయం ప్రకారం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్లో కొనసాగడని అనిపిస్తోంది. ధోనీ తప్పా మరే ఆటగాడు రిటైన్ చేసుకున్న తర్వాత మూడేళ్లు అదే జట్టులో కొనసాగుతాడని చెప్పలేం.
ధోనీ, చెన్నై సూపర్ కింగ్స్ కథ భిన్నమైనది. కానీ ముంబై ఇండియన్స్కు రోహిత్ శర్మ గుడ్బై చెబుతాడు. లేదా ముంబై ఇండియన్సే అతన్ని వదిలేస్తుంది. ఇందులో ఏదైనా జరగవచ్చు. అయితే రోహిత్ శర్మను రిటైన్ చేసుకుంటారని మాత్రం నేను అనుకోవడం లేదు. రోహిత్ రిటెన్షన్కు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. కానీ రోహిత్ ఆ జట్టును వీడుతాడని నాకు అనిపిస్తోంది.
ట్రేడ్ విండో ద్వారా అతను ఇతర జట్టుకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అలా జరగకుంటే మాత్రం వేలంలోకి వస్తాడు. ముంబై ఇండియన్స్తో రోహిత్ శర్మ ప్రయాణం ముగిసిందనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్.'అని ఆకాశ్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా చెప్పుకొచ్చాడు.
ఫ్రాంచైజీలు ఎగబడుతాయి..
ఇదే అంశంపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ వేలంలోకి వస్తే అతని కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయని చెప్పాడు.
'రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ అతను వేలంలోకి వెళ్తే మాత్రం.. అతని కోసం ఏ జట్టు పోటీపడుతుందో అనేది చూడటానికి రసవత్తరంగా ఉంటుంది. కచ్చితంగా రోహిత్ శర్మ కోసం ఫ్రాంచైజీలు ఎగబడుతాయి.
రోహిత్ శర్మ అద్భుతమైన ఆటగాడు. సూపర్ కెప్టెన్. టాప్ క్వాలిటీ కెప్టెన్, ప్లేయర్. ఇప్పటికే మ్యాచ్ విన్నర్గా నిరూపించుకున్నాడు. 37 ఏళ్ల వయసులో ఉన్నా అతను ఇంకా చాలా క్రికెట్ ఆడగలడు. రోహిత్ వేలంలోకి వస్తే మాత్రం అతను భారీ ధర పలికే ఛాన్స్ ఉంది. వేలం మొత్తం ఆసక్తికరంగా మారనుంది.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.