ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా పంజాబ్ కింగ్స్తో జరుగుతున్న ఫైనల్లో ఆర్సీబీ 191 పరుగుల పోరాడే లక్ష్యాన్ని నమోదు చేసింది. విరాట్ కోహ్లీ(35 బంతుల్లో 3 ఫోర్లతో 43) టాప్ స్కోరర్గా నిలిచాడు. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు చేసింది. మయాంక్ అగర్వాల్(24), రజత్ పటీదార్(26), లివింగ్ స్టోన్(25), జితేష్ శర్మ(24) పర్వాలేదనిపించారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్(3/40), కైల్ జెమీసన్(3/48) మూడేసి వికెట్లతో నిప్పులు చెరగగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, విజయ్ కుమార్ వైశాఖ్, యుజ్వేంద్ర చాహల్ తలో వికెట్ తీసారు.

శుభారంభం లేదు..
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఆర్సీబీకి ఆశించిన శుభారంభం దక్కలేదు. వరుస విరామాల్లో ఆర్సీబీ వికెట్లు కోల్పోయింది. తొలి ఓవర్లోనే రెండు ఫోర్లు, సిక్స్తో దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫిల్ సాల్ట్(16)ను కైల్ జెమీసన్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. పవర్ ప్లేలో మయాంక్ అగర్వాల్ ఒక సిక్స్ , రెండు బౌండరీలు బాదగా.. కోహ్లీ ఒక బౌండరీ మాత్రమే కొట్టడంతో ఆర్సీబీ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిసిన వెంటనే చాహల్ను రంగంలోకి దింపిన శ్రేయస్ అయ్యర్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. క్రీజులో సెట్ అయిన మయాంక్ అగర్వాల్(24)ను చాహల్ క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.
దెబ్బతీసిన కైల్ జెమీసన్
క్రీజులోకి వచ్చిన రజత్ పటీదార్ భారీ సిక్సర్ బాదగా.. కోహ్లీ తనదైన శైలిలో క్విక్ సింగిల్స్, డబుల్స్ తీసాడు. క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జెమీసన్ విడదీసాడు. భారీ సిక్సర్ బాదిన రజత్ పటీదార్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. లివింగ్ స్టోన్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు నడిపించిన కోహ్లీ.. అనవసర షాట్తో వికెట్ పారేసుకున్నాడు. జితేశ్ శర్మ 2 ఫోర్లు, 2 సిక్స్లతో దూకుడుగా ఆడగా.. లివింగ్ స్టోన్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. అతన్ని జెమీసన్ ఎల్బీ చేయగా.. జితేశ్ శర్మను విజయ్ కుమార్ వైశాఖ్ ఔట్ చేశాడు. ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న రొమారియా షెపర్డ్ ఓ భారీ సిక్సర్ కొట్టగా.. ఆఖరి ఓవర్లో అర్ష్దీప్ సింగ్ మూడు వికెట్లు తీసి మూమెంటమ్ను తమవైపు తిప్పుకున్నాడు.