ఐపీఎల్ 2025 సీజన్ ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లను అహ్మదాబాద్, న్యూ చంఢీఘర్ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు ఐపీఎల్ నిర్వాహకులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఫైనల్తో పాటు క్వాలిఫయర్-2 మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్రమోడీ స్టేడియంలో జరుగుతాయని, క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్లకు చంఢీఘర్లోని కొత్త స్టేడియం ఆతిథ్యం ఇస్తుందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
భారత్-పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ను వారం పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు చక్కబడటంతో గత శనివారమే ఐపీఎల్ 2025 సీజన్ తిరిగి ప్రారంభమైంది. రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించిన బీసీసీఐ.. ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలను మాత్రం వెల్లడించలేదు.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్ వేదికగా క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా క్వాలిఫయర్-2, ఫైనల్ మ్యాచ్ నిర్వహించాల్సి ఉంది. టోర్నీ రూల్స్ ప్రకారం గత సీజన్ విన్నర్, రన్నరప్ జట్ల హోమ్ గ్రౌండ్స్కు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు కేటాయిస్తారు. ఈ ప్రకారమే ఈ ఏడాది ప్లే ఆఫ్స్ మ్యాచ్లు కోల్కతా, హైదరాబాద్ వేదికగా నిర్వహించాల్సి ఉంది. కానీ ఐపీఎల్ 2025 వారం పాటు వాయిదా పడటంతో షెడ్యూల్ మార్చాల్సి వచ్చింది. భద్రతా పరంగా ఎలాంటి సమస్యలేకున్నా.. హైదరాబాద్, కోల్కతాలో వర్షాలు కురిసే ఛాన్స్ ఉండటంతోనే ప్లే ఆఫ్స్ మ్యాచ్లను బీసీసీఐ ఇతర వేదికలకు తరలించింది.

అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్తో పాటు క్వాలిఫయర్-2, ఛండీఘర్లోని ముల్లాన్పూర్ వేదికగా క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్ల నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్లయించిందని, మరికొద్ది గంటల్లోనే అధికారిక ప్రకటన రాబోతుందని క్రిక్బజ్ పేర్కొంది. ఈ కథనం వెలువడిన గంటలో వ్యవధిలోనే బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చింది. ఐపీఎల్ 2025 రివైజ్డ్ షెడ్యూల్ ప్రకారం మే29న క్వాలిఫయర్-1, మే 30న ఎలిమినేటర్, జూన్1న క్వాలిఫయర్-2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది.
కోల్కతా వేదికగానే ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని ఆ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. కొందరు అభిమానులు ఈడెన్ గార్డెన్స్ బయట ధర్నా కూడా చేశారు. బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ సైతం.. ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. కోల్కతాలోనే ఫైనల్ జరుగుతుందని చెప్పాడు. కానీ అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తుండటంతో కోల్కతా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ అభిమానులు కూడా బీసీసీఐ తీరుపై మండిపడుతున్నారు.