ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో ఫ్రాంచైజీల రిటెన్షన్ జాబితాలు మరికొద్ది గంటల్లో అధికారికంగా విడుదల కానున్నాయి. రిటెన్షన్ జాబితాలను సమర్పించేందుకు ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఇచ్చిన గడువు నేటి(గురువారం)తో ముగియనుంది. ఈ రిటెన్షన్ జాబితాలను ఐపీఎల్ అధికారిక బ్రాడ్ కాస్టర్స్ జియో సినిమా, స్టార్ స్పోర్ట్స్ సాయంత్రం 4.30 నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వెల్లడించనున్నాయి.
మొత్తం ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకునేందుకు బీసీసీఐ అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అనామక ఆటగాళ్లను తీసుకోవాలనే నిబంధనను పెట్టింది. ఈ ఆరుగురి ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్తో వేలంలో తిరిగి కొనుగోలు చేయవచ్చు.

ఆటగాళ్లను నేరుగా రిటైన్ చేసుకోవాలంటే ఆయా ఫ్రాంచైజీలు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
ఇప్పటికే 10 ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను బీసీసీఐకి సమర్పించాయి. ఐపీఎల్ 2024 సీజన్ రన్నరప్ సన్రైజర్స్ హైదరాబాద్.. కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు హెన్రీచ్ క్లాసెన్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డిలను రిటైన్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. హెన్రీచ్ క్లాసెన్కు ఏకంగా రూ. 23 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకున్నారని, ప్యాట్ కమిన్స్కు రూ. 18 కోట్లు, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లకు రూ. 14 కోట్లు, నితీష్ కుమార్ రెడ్డికి రూ.6 కోట్లు ఇచ్చి అట్టిపెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే జట్టులో వీదేశీ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్ ఎప్పుడూ విదేశీ ఆటగాళ్లపైనే ఆధారపడిందని, ఆ జట్టు ఆవిర్భావం నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ జట్లలో ఇది నా జట్టు అని ఫీలవని ఏకైక టీమ్ ఏదైనా ఉందా? అంటే అది సన్రైజర్స్ హైదరాబాద్ మాత్రమేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
స్వదేశీ ఆటగాళ్లతో జట్టును నిర్మించే దమ్ము సన్రైజర్స్ హైదరాబాద్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కావ్య మారన్ మారదని, సన్రైజర్స్ అభిమానుల దృష్టిలో విదేశీ టీమ్గానే మిగిలిపోతుందని అభిప్రాయపడుతున్నారు.