ఐపీఎల్ 2025 సీజన్ కామెంట్రీపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లీష్ మినహా.. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం కామెంట్రీపై ఆయా రాష్ట్రాల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఓ అభిమాని హిందీ కామెంట్రీ తీరును తప్పుబడుతూ ఓ వీడియోను పోస్ట్ చేయగా.. అది తెగ వైరల్ అయ్యింది. తాజాగా తెలుగు కామెంట్రీపై కూడా విమర్శలు వ్యక్తమయ్యాయి.
సాధారణంగా కామెంటేటర్స్ ఏదో జట్టుకు లేదా ఆటగాళ్లకు మద్దతుగా మాట్లాడుతుంటారు. ఇది చాలా ఏళ్ల నుంచి ఉన్నదే. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సైతం ఓ తెలుగు పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. కామెంటేటర్లు తమ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లకు ఎలివేషన్స్ ఇస్తారని, వారి తప్పులను కప్పిపుచ్చుతారని తెలిపాడు. అలాంటి సాయం లేకపోవడంతోనే తనకు ఎక్కువ అవకాశాలు రాలేదన్నాడు. తాను ఆడే రోజుల్లో ముంబై క్రికెటర్లకు ఇలాంటి మద్దతు ఎక్కువగా లభించేదని పేర్కొన్నాడు. అయితే ఈ మధ్య ఇది శృతి మించిందని, ఆటకే ముప్పుగా మారిందని రాయుడు ఆవేదన వ్యక్తం చేశాడు. క్రికెటర్ల పీఆర్ కూడా దారుణంగా మారిందని చెప్పాడు.

గతంలో ఆటగాళ్ల టెక్నిక్ విషయాలతో పాటు మ్యాచ్కు సంబంధించిన విషయాలను విశ్లేషిస్తూ.. కవితలు, జోకులు పేల్చుతూ కామెంట్రీ చెప్పేవారు. వినసొంపైన వ్యాఖ్యానంతో ఆకట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా డైలాగ్స్తో పాటు ఆటగాళ్లపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ వ్యాఖ్యానం చేస్తున్నారు. ఈ క్రమంలో కొందరు మాజీ క్రికెటర్లు బీసీసీఐ ఆగ్రహానికి కూడా గురయ్యారు.
మరికొందరు ఆటగాళ్లకు విపరీతమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ గురించి మాట్లాడాలంటే స్టార్ స్పోర్ట్స్ చూడాలని సెటైర్లు పేల్చాడు. దీని బట్టే కామెంటేటర్ల భజన ఏ స్థాయిలో ఉందో.. అర్థం చేసుకోవచ్చు.
ఐపీఎల్ 2025 సీజన్ విషయానికి వస్తే.. తెలుగు, హిందీ కామెంటేటర్లు ధోనీ భజన చేస్తున్నారు. ప్రతీ సందర్భంలోనూ ధోనీ గురించే మాట్లాడుతున్నారు. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో తెలుగు కామెంటేటర్స్.. ధోనీకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వ్యాఖ్యానం చేయడం నెటిజన్లకు చికాకు తెప్పించింది. ఈ క్రమంలో ఓ అభిమాని సోషల్ మీడియా వేదికగా తెలుగు కామెంటేటర్లను తప్పుబట్టాడు. తెలుగు కామెంటేటర్ల కారణంగా ధోనీపై ఉన్న అభిమానం తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి నుంచి ధోనీ మాట వింటేనే రోత పుడుతుందని మండిపడ్డాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.