ఐపీఎల్ 2025 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ అదిరిపోయే విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ రాయల్స్తో ఉప్పల్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇషాన్ కిషన్(47 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్స్లతో 106 నాటౌట్) అజేయ శతకం.. ట్రావిస్ హెడ్(31 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లతో 67) విధ్వంసంతో సన్రైజర్స్ హైదరాబాద్ 286 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసి సునాయస విజయాన్నందుకుంది.
అయితే ఈ గెలుపు క్రెడిట్ టీమ్ ఓనర్ కావ్య మారన్దేనని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. వ్యూహాత్మకమైన నిర్ణయాలతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో కత్తిలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేసి జట్టను బలోపేతం చేసిందని అభిప్రాయపడుతున్నారు. అసాధారణ ఆటగాళ్లను కొనుగోలు చేసి అవెంజర్స్ టీమ్ను సృష్టించిందని కొనియాడుతున్నారు.

కావ్య పాపదే గెలుపు క్రెడిట్..
ఐపీఎల్ 2024 సీజన్లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన సన్రైజర్స్ హైదరాబాద్.. తృటిలో టైటిల్ చేజార్చుకుంది. ఫైనల్లో కేకేఆర్ చేతిలో ఓటమిపాలైంది. కానీ ఈ సీజన్ ఆరంభంలోనే రికార్డ్ స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. సన్రైజర్స్ విధ్వంసకర బ్యాటింగ్కు ప్రధాన కారణం ఆ జట్టు ప్రణాళికబద్దమైన నిర్మాణం. టీమ్ ఎంపికలో ఓనర్ కావ్య మారన్ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్ 2025 మెగావేలంలో ఇషాన్ కిషన్ను తీసుకొని జట్టు బలాన్ని రెండింతలు చేశారు. జట్టు బలహీనతను కూడా అధిగమించారు. గత సీజన్ ఫైనల్ ఓటమితో తీవ్రంగా బాధపడిన కావ్య మారన్.. తప్పిదాల నుంచి గుణపాఠం నేర్చుకొని మెగా వేలంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు.
ఇషాన్ కిషన్ కోసం..
ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రీచ్ క్లాసెన్లతో కూడిన కోర్టీమ్ను అంటిపెట్టుకొని వారికి తగ్గట్లుగా.. జట్టుకు కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ఇషాన్ కిషన్ కోసం ఏకంగా రూ. 11 కోట్లు ఖర్చు చేశారు. ఆ సమయంలో కావ్య మారన్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. జట్టులో బిగ్ హిట్టర్స్ ఉన్న తర్వాత ఇషాన్ కిషన్ ఎందుకనే మాటలు వినిపించాయి. కానీ కావ్య మారన్ వ్యూహం ఏంటో తాజా మ్యాచ్తో అందరికి అర్థమైంది.
దూకుడే మంత్రాన్ని జపిస్తున్న సన్రైజర్స్ అందుకు తగ్గట్లుగానే ఆటగాళ్లను ఎంపిక చేయడంతో పాటు వారికి అండగా నిలిచింది. డకౌట్ అయినా పర్వాలేదు.. అప్రోచ్లో తగ్గేవద్దని చెప్పి పంపింది. తొలి మ్యాచ్ అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇషాన్ కిషన్.. టీమ్మేనేజ్మెంట్కు హ్యాట్సాఫ్ చెప్పాడు. ఈ క్రమంలోనే కావ్య మారన్ను నెటిజన్లు కొనియాడుతున్నారు. అద్భుతమైన జట్టును ఎంపిక చేసి కుర్రాళ్లకు అండగా నిలుస్తున్నందుకు ఆమెకు ధన్యవాదాలు చెబుతున్నారు.