ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆ జట్టు కొనుగోలు చేసిన ఇంగ్లండ్ ప్లేయర్స్ భారత్తో జరిగిన తొలి టీ20లో దారుణంగా విఫలమయ్యారు. కోల్కతా వేదికగా బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసిన విషయం తెలిసిందే.
ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. గతేడాది నవంబర్లో జెడ్డా వేదికగా జరిగిన మెగా వేలంలో ఆర్సీబీ మొత్తం 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ముగ్గురు ఇంగ్లండ్ ఆటగాళ్లను తీసుకుంది. ఈ ముగ్గురు భారత్తో జరిగిన తొలి టీ20 ఆడారు. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ముగ్గురు కలిసి ఏడు పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఇద్దరు బ్యాటర్లు డకౌటయ్యారు.

రూ. 23 కోట్లు దండగేనా..?
ఆర్సీబీ రూ. 11.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఫిల్ సాల్ట్ మూడు బంతులే ఆడి డకౌట్గా వెనుదిరిగాడు. అర్ష్దీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే ఫిల్ సాల్ట్ క్యాచ్ ఔటయ్యాడు. గ్లేన్ మ్యాక్స్వెల్ స్థానంలో రూ. 8.75 కోట్లకు తీసుకున్న లియమ్ లివింగ్ స్టోన్ టూ బాల్ డక్గా వెనుదిరిగాడు. వరుణ్ చక్రవర్తీ వేసి స్టన్నింగ్ డెలివరీకి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
రూ. 2.6 కోట్లకు తీసుకున్న జాకోబ్ బెతెల్ 14 బంతుల్లో 7 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా బౌలింగ్లో వెనుదిరిగాడు. స్పిన్ బౌలింగ్ ఆడటంలో తెగ ఇబ్బంది పడ్డాడు. ఈ ముగ్గురి బ్యాటింగ్ చూసి ఆర్సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా వేదికగా ఆర్సీబీ మేనేజ్మెంట్పై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ ఆటగాళ్ల కోసం రూ. 23 కోట్లు ఖర్చు పెట్టారా? అని మండిపడుతున్నారు. అప్కమింగ్ సీజన్లో కూడా నిరాశ తప్పదా? అని పోస్ట్లు పెడుతున్నారు.
ఆందోళనలో ఆర్సీబీ ఫ్యాన్స్..
గత సీజన్లో కేకేఆర్ తరఫున అద్భుత ప్రదర్శన కనబర్చిన ఫిల్సాల్ట్ తనకు అలవాటైన కండిషన్స్లో విఫలమవ్వడం ఆర్సీబీ అభిమానులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యం కారణంగా హోరాహోరీ తప్పదనుకున్న ఈ మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది.
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్(44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లతో 68) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. హ్యారీ బ్రూక్(17), జోఫ్రా ఆర్చర్(12) మినహా అంతా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు.
అభిషేక్ శర్మ విధ్వంసం..
అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్.. అభిషేక్ శర్మ (34 బంతుల్లో 5 ఫోర్లు,8 సిక్స్లతో 79) విధ్వంసకర బ్యాటింగ్తో 12.5 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. అభిషేక్ శర్మతో పాటు సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 26), తిలక్ వర్మ(16 బంతుల్లో 3 ఫోర్లతో 19 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్(2/21) రెండు వికెట్లు తీయగా..ఆదిల్ రషీద్కు ఓ వికెట్ దక్కింది.