ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) చేతిలో ఎదురైన పరాజయాన్ని సీఎస్కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆర్సీబీపై విజయం సాధించి.. గతేడాది ఆ జట్టు చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటుందనే ఆశలతో స్టేడియానికి వచ్చిన అభిమానులు ఘోర పరాజయాన్ని తట్టుకోలేకపోయారు. ఈ పరాజయంతో ఆర్సీబీ అభిమానులు ముందు తమ పరువు పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్టేడియం బయట తమిళ ఛానెల్స్తో మాట్లాడిన ఫ్యాన్స్.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అభిమానుల ఎమోషన్స్తో సీఎస్కే ఫ్రాంచైజీ ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేంద్ర సింగ్ ధోనీ పేరు చెప్పి దోచుకుంటున్నారని ఆరోపించారు. టీమ్ సెలెక్షన్ను కూడా తప్పుబట్టారు. వరుసగా విఫలమవుతున్న దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠిలను ఎందుకు ఆడిస్తున్నారని ప్రశ్నించారు. ధోనీ ఆలస్యంగా బ్యాటింగ్ రావడం ఏందని మండిపడుతున్నారు.

మ్యాచ్ అనంతరం మైదానం బయట ఓ అభిమాని మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్గా మారాయి. ధోనీ రిటైర్మెంట్ అవ్వడమే ఉత్తమమని సదరు అభిమాని అభిప్రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. 'దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠిని ఎందుకు ఆడిస్తున్నారు? బ్లాక్లో ఒక్కో టికెట్ రూ. 15వేలకు అమ్ముతున్నారు. ధోనీ 13వ ఓవర్లోనే రావాల్సి ఉన్నా రాలేదు. 18వ ఓవర్లో వచ్చి సిక్సర్, ఫోర్ కొట్టగానే.. ఫ్యాన్స్ తలా.. తలా అని అరుస్తున్నారు. ధోనీ రిటైర్ అయితే మంచిది'అని సదరు అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు.
సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్టాండ్స్ టికెట్ల ధరలు రూ.1700 నుంచి రూ. 7500 వరకు ఉన్నాయి. అయితే చాలా టికెట్లు బ్లాక్లో నాలుగింతల రెట్లకు అమ్మినట్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.