ఐపీఎల్ 2025 సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) ఘనంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్తో ఆదివారం చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో సమష్టిగా రాణించిన సీఎస్కే 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ తొండాట ఆడిందని ఫ్యాన్స్ ఆరోపిస్తుండటం చర్చనీయాంశమైంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఆ జట్టు ప్రధాన పేసర్ ఖలీల్ అహ్మద్ బాల్ టాంపరింగ్ చేశారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఒక వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు.
ఈ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులే ఇచ్చాడు. అంతేకాకుండా కీలకమైన మూడు వికెట్లు తీసాడు. ఆ జట్టు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేయడంతో పాటు మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను వరుస ఓవర్లలో క్లీన్ బౌల్డ్ చేశాడు. చివర్లో ట్రెంట్ బౌల్ట్(1)ను క్యాచ్ ఔట్గా పెవిలియన్ చేర్చాడు.

సీఎస్కేను బ్యాన్ చేయండి..?
అయితే బౌలింగ్ సమయంలో సీక్రెట్గా తెచ్చిన వస్తువుతో బంతి ఆకారాన్ని దెబ్బతీసాడని, ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్కు అందజేశాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ఉండటంతో ఈ వ్యవహారంపై తీవ్ర దుమారం రేగుతోంది. ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడని ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి చెన్నై సూపర్ కింగ్స్పై నిషేధం విధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
సీఎస్కే X ముంబై ఫ్యాన్స్..
అయితే ఈ ఆరోపణలకు సీఎస్కే ఫ్యాన్స్ ధీటుగా బదులిస్తున్నారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా.. ఆరోపణలు చేయడం సరికాదంటున్నారు. వీడియోలో ఖలీల్ రుతురాజ్ చేతికి ఏమిచ్చాడు అనేది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదని, బంతి ఆకారం దెబ్బతీస్తే అంపైర్లు జోక్యం చేసుకునేవారు కదా? అని ప్రశ్నిస్తున్నారు. టీవీ అంపైర్ ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని కౌంటరిస్తున్నారు.
రఫ్ఫాడించిన నూర్ అహ్మద్..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్తో 29), తిలక్ వర్మ(25 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 31)టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 28 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. సీఎస్కే బౌలర్లలో నూర్ అహ్మద్(4/14) నాలుగు వికెట్లు తీయగా.. ఖలీల్ అహ్మద్(3/29) మూడు వికెట్లు పడగొట్టాడు. నాథన్ ఎల్లిస్, రవిచంద్రన్ అశ్విన్కు చెరో వికెట్ దక్కింది.
అనంతరం సీఎస్కే 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్లతో 53), రచిన్ రవీంద్ర(44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్లతో 59 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముంబై బౌలర్లలో విజ్ఞేష్ పుతుర్(3/32) మూడు వికెట్లు తీయగా.. దీపక్ చాహర్ ఓ వికెట్ పడగొట్టాడు.