టీమిండియా స్టార్ బ్యాటర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ప్లేయర్ విరాట్ కోహ్లీ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీకి భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. శత్రు దేశమైన పాకిస్థాన్లోనూ కోహ్లీ అంటే పడి చచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. కోహ్లీని ఒక్కసారైన కలవాలని కోరుకునే అభిమానులు కోట్లలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో అభిమానులు తమ జీవితాలను రిస్క్ చేసి మరి కోహ్లీని కలిసే ప్రయత్నం చేశారు. ఐపీఎల్ 2025 సీజన్ ఫస్ట్ మ్యాచ్లో ఓ కోల్కతా అభిమాని కోహ్లీ కాళ్లు మొక్కి కటకటాల పాలయ్యాడు.
తాజాగా రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) మధ్య జరిగిన మ్యాచ్లోనూ ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. అభిమానిని గమనించిన కోహ్లీ.. అతనికి దొరకకుండా దూరంగా పరుగెత్తాడు. దాంతో సదరు అభిమాని కోహ్లీని కలవకుండానే సెక్యూరిటీకి చిక్కాడు. అతన్ని సెక్యూరిటీ సిబ్బంది బయటకు ఈడ్చుకెళ్లారు. అయితే ఈ ఘటన మ్యాచ్ అనంతరం చోటు చేసుకోవడం గమనార్హం.

ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 173 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్(47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లతో 75) హాఫ్ సెంచరీతో రాణించగా.. రియాన్ పరాగ్(22 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 30), ధ్రువ్ జురెల్(23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 35 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హజెల్ వుడ్, కృనాల్ పాండ్యా తలో వికెట్ తీసారు.
అనంతరం ఆర్సీబీ 17.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 175 పరుగులు చేసి గెలుపొందింది. విరాట్ కోహ్లీ(45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్లతో 62 నాటౌట్), ఫిల్ సాల్ట్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్లతో 65) హాఫ్ సెంచరీలతో రాణించారు. దేవదత్ పడిక్కల్(28 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్తో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో కుమార్ కార్తీకేయ ఒక్కడే వికెట్ తీసాడు.