ఐపీఎల్ 2025 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పోరాటం ముగిసింది. ముంబై ఇండియన్స్తో బుధవారం జరిగిన డూ ఆర్ డై మ్యాచ్లో సమష్టిగా విఫలమైన ఢిల్లీ క్యాపిటల్స్ 59 పరుగుల తేడాతో చిత్తయ్యింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. ఢిల్లీ క్యాపిటల్స్ అధికారికంగా ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. చివరి మ్యాచ్ గెలిచినా.. ముంబైని అధిగమించే పరిస్థితి లేకపోవడంతో ఢిల్లీ ఇంటిబాట పట్టింది. అయితే ఈ మ్యాచ్లో చివరి రెండు ఓవర్లలో 48 పరుగులివ్వడం తమ పతనాన్ని శాసించిందని ఢిల్లీ క్యాపిటల్స్ తాత్కలిక కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. అక్షర్ పటేల్ లేకపోవడం కూడా తమ విజయవకాశాలను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు.

ఆ రెండు ఓవర్లే..
'మేం బాగానే బౌలింగ్ చేశాం అనిపించింది. ఈ మ్యాచ్లో ఓడినా మా కుర్రాళ్లు గొప్ప పోరాట పటిమను చూపించారు. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. బ్యాటింగ్ చేయడానికి ఇది అంత సులువైన పిచ్ కాదు. చివరి రెండు ఓవర్లలోనే మేము మ్యాచ్పై పట్టు కోల్పోయాం. క్రికెట్లో మూమెంటమ్ చాలా ముఖ్యం. చివరి రెండు ఓవర్లలో ముంబై బ్యాటర్లు దాదాపు 50 పరుగులు చేశారు. ఇది మా 17-18 ఓవర్ల అద్భుతమైన ఆటను నాశనం చేసింది. ఇక్కడే మేం మూమెంటమ్ కోల్పోయాం.
అందుకే ఇంటి బాట పట్టాం..
ఈ మ్యాచ్లో రెండు జట్లను చూస్తే.. నాకు డేవిడ్, గోలియత్ కథ గుర్తుకొచ్చింది. ఈ పోరును నేను ఆస్వాదించాను. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు జట్టుగా ఆడేందుకు అవకాశం ఇస్తాయి. సమీర్ రిజ్వీ అద్భుతంగా ఆడాడు. అతనిలో ప్రతిభ ఉంది. తొలి ఇన్నింగ్స్లో 17-18 ఓవర్ల వరకు మ్యాచ్ మా చేతుల్లోనే ఉంది. కానీ ఆ తర్వాత చేజారింది. గత 7-8 మ్యాచ్ల్లో మేం బ్యాటింగ్, బౌలింగ్లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతోనే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించలేదు.
అక్షర్ పటేల్ ఉంటే..
ఈ వికెట్పై అక్షర్ పటేల్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మిచెల్ శాంట్నర్ బౌలింగ్ చేసిన తీరుతో ఈ విషయం స్పష్టంగా తెలుసొచ్చింది. ఇలాంటి వికెట్పై అక్షర్ పటేల్ సత్తా చాటేవాడు. కానీ అతను అనారోగ్యంతో బాధపడుతున్నాడు. స్కార్క్ కూడా అద్భుతమైన బౌలరే. కానీ ఈ వికెట్పై స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. క్రికెట్లో మూమెంటమ్ను ఎప్పుడూ లైట్ తీస్కోవద్దు. చివరి రెండు మ్యాచ్ల్లో మూమెంటమ్ అందుకోవడానికి మేం బాగా పోరాడం. అగ్రస్థానంలో ఉన్నప్పుడు అస్సలు మూమెంటమ్ కోల్పోకూడదు.'అని ఫాఫ్ డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు.
చెలరేగిన సూరీడు..
ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్(43 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్లతో 73 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. నమన్ ధీర్(8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లతో 24 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో ముఖేష్ కుమార్(2/48) రెండు వికెట్లు తీయగా.. దుష్మంత్ చమీరా, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ తీసారు. చివరి 2 ఓవర్లలో ముంబై 48 పరుగులు చేయడం గమనార్హం. 19వ ఓవర్ వేసిన ముఖేష్ కుమార్ 27 పరుగులిచ్చి ఢిల్లీ క్యాపిటల్స్ కొంపముంచాడు.
అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ 18.2 ఓవర్లలో 121 పరుగులకు కుప్పకూలింది. సమీర్ రిజ్వీ(35 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 39), విప్రజ్ నిగమ్(11 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్తో 20) టాప్ స్కోరర్లుగా నిలిచారు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో మిచెల్ సాంట్నర్(3/11), జస్ప్రీత్ బుమ్రా(3/12) మూడేసి వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించారు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, విల్ జాక్స్, కర్ణ్ శర్మ తలో వికెట్ తీసారు.