ఐపీఎల్ 2025 సీజన్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య ఉప్పల్ వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఔటవ్వకుండానే వెనుదిరగడం తీవ్ర వివాదాస్పదమైంది. ఆటగాళ్లు అప్పీల్ చేయకుండానే.. అంపైర్ తన నిర్ణయాన్ని ప్రకటించక ముందే ఇషాన్ కిషన్ పెవిలియన్ బాట పట్టడం అనేక సందేహాలకు దారి తీసింది. ఈ ఘటనపై సన్రైజర్స్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇషాన్ కిషన్ ఫిక్సింగ్కు పాల్పడ్డాడని, ముంబై ఇండియన్స్ అధినేత ముఖేష్ అంబానీ తన పలుకుబడితో ఆటగాళ్లతో పాటు అంపైర్లను కొనేసాడని, ఐపీఎల్ మొత్తం ఫిక్సింగ్, స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని కొందరు అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంకొందరైతే ఐపీఎల్ను ఎవరూ చూడవద్దని కూడా హితవు పలుకుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
దీపక్ చాహర్ వేసిన వేసిన మూడో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతిని ఇషాన్ కిషన్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ను మిస్సైన బంతి కీపర్ చేతిలో పడింది. ఆ వెంటనే ఇషాన్ కిషన్ క్రీజును వదిలాడు. వైడ్ ఇచ్చేందుకు సిద్దమైన అంపైర్ వినోద్.. ఇషాన్ కిషన్ క్రీజును వీడటం చూసి తన నిర్ణయాన్ని మార్చుకొని ఔటిచ్చాడు. ముంబై వికెట్ కీపర్, బౌలర్లు అప్పీల్ చేయలేదు. బంతి బ్యాట్కు తాకిందని పొరబడిన ఇషాన్.. ఇవేవి పట్టించుకోకుండా క్రీజును వీడాడు. కానీ రిప్లేలో బంతి బ్యాట్కు తాకలేదని స్పష్టమైంది. దాంతో వివాదం చెలరేగింది.
క్రీడా స్ఫూర్తిని చాటాలనే అత్యుత్సాహంతో ఇషాన్ కిషన్ ఘోర తప్పిదం చేశాడు. అయితే ఆటగాళ్లు అప్పీల్ చేయకుండానే అంపైర్ ఎలా ఔటిచ్చాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కానీ కీపర్, బౌలర్ అప్పీల్ చేయకపోయినా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా అప్పీల్ చేశాడు. ఈ మ్యాచ్ హైలైట్స్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
బ్యాట్ తాకిందనే..
ఔటివ్వకుండానే ఇషాన్ కిషన్ ఎందుకు వెళ్లిపోయాడనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. బంతి బ్యాట్కు తాకిందని పొరబడిన ఇషాన్ కిషన్.. క్రీడా స్ఫూర్తిని చాటాలనే ఉద్దేశంతో అంపైర్ నిర్ణయాన్ని పట్టించుకోకుండా క్రీజును వీడాడు. ఇలా బ్యాటర్లు అంపైర్ నిర్ణయం ప్రకటించకుండా వెళ్లడం ఇదే తొలిసారి కాదు. గతంలో చాలా మంది ఇలా అంపైర్ నిర్ణయం కోసం వేచి చూడకుండా క్రీజును వీడి క్రీడా స్ఫూర్తిని చాటుకున్నారు.
ఈ మ్యాచ్లో ఎలాంటి ఫిక్సింగ్ జరగలేదు. ఇషాన్ కిషన్ చేసిన తప్పిదాన్ని భూతద్దంలో చూస్తూ.. కొందరు కావాలనే ఐపీఎల్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. మ్యాచ్ను నిశితంగా పరిశీలించిన వారికి ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఆటగాళ్లు, ఫ్రాంచైజీ ఓనర్లపై బీసీసీఐ ప్రత్యేక నిఘా ఉంటుంది. ఎలాంటి ఫిక్సింగ్ జరిగే అవకాశం లేదు. 'నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది'అనే తరహాలో ముంబై ఇండియన్స్ అంటే నచ్చని జనాలు.. ఓడిపోయిన బాధలో ఉన్న సన్రైజర్స్ అభిమానులు.. అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు.