2018 అండర్ 19 ప్రపంచకప్ విజయంతో ఓ కుర్రాడు తారా జువ్వలా భారత క్రికెట్లోకి దూసుకొచ్చాడు. విధ్వంసకర బ్యాటింగ్తో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ను తలపిస్తూ.. భారత భవిష్యత్తు ఆటగాడిగా ప్రశంసలు అందుకున్నాడు. 19 ఏళ్ల వయసులోనే భారత జట్టు తరఫున టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు.
ఫస్ట్ మ్యాచ్లోనే సెంచరీ బాది అందరి నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఆ కుర్రాడి బ్యాటింగ్ను చూసి టీమిండియాకు మరో కోహ్లీ దొరికాడని అంతా అనుకున్నారు. భవిష్యత్తులో టీమిండియాను ఏలుతాడని సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు మెచ్చుకున్నారు. కానీ 6 ఏళ్ల తర్వాత అదే కుర్రాడు ఐపీఎల్లో అన్సోల్డ్గా మిగిలిపోయాడు.

అతన్ని కనీస ధరకు తీసుకునేందుకు కూడా ఫ్రాంచైజీలు ఆసక్తిచూపలేదు. అంతలా దిగజారిన ఆ ఆటగాడు ఎవరో కాదు.. టీమిండియా సెన్సేషన్ పృథ్వీ షా..!
టాలెంట్ ఉంటే సరిపోదు..
టాలెంట్ ఉంటే సరిపోదు.. అందుకు తగ్గట్లు క్రమశిక్షణ ఉండాలి అనే పెద్దల మాట పృథ్వీ షా కెరీర్ను చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. చిన్నవయసులోనే డబ్బు,ఫేమ్ రావడంతో పృథ్వీ షా గాడి తప్పాడు. చెడు స్నేహాలతో పాటు ఆటపై ఫోకస్ తగ్గింది. దానికి తోడు గాయాలు అతన్నివెంటాడాయి.
2018 ఆస్ట్రేలియా పర్యటనలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడటం అతని కెరీర్ను అగాథంలోకి నెట్టింది. ఆ తర్వాత దగ్గు సిరప్ తాగి డోపింగ్ టెస్ట్లో విఫలమై బీసీసీఐ నుంచి నిషేధం ఎదుర్కొన్నాడు. ఐపీఎల్లో సత్తా చాటినా.. నిలకడలేమి అతనికి అవకాశాలు రాకుండా చేసింది. అవకాశాలు వచ్చినా తుది జట్టులో ఆడలేని పరిస్థితి ఏర్పడింది.

23 ఏళ్లకే పొట్ట..బట్ట!
కౌంటీ క్రికెట్, దేశవాళీ క్రికెట్లో సెంచరీల మోత మోగించినా.. గాయాల బారిన పడటంతో అతని కెరీర్ను మరింత నాశనం చేసింది. స్వప్నగిల్ అనే యూట్యూబర్తో జరిగిన గొడవ అతనికి తీవ్ర నష్టం చేసింది. వరుస గాయాలు.. అవకాశాలు లేకపోవడంతో పృథ్వీ షా తీవ్ర డిప్రేషన్కు లోనయ్యాడు.
ఫిట్నెస్పై దృష్టిసారించలేకపోయాడు. నాలుగేళ్ల వయసులోనే తల్లి మరణించడంతో.. తండ్రి చాటున పెరిగిన పృథ్వీ షా.. స్వయంకృపరాధంతో పాటు విధిరాత కూడా కలిసిరాలేదు. 23 ఏళ్ల వయసులోనే పొట్ట, బట్టతో కనిపించి తీవ్ర బాడీషేమింగ్కు గురయ్యాడు. కోచ్ల మాట వినకపోవడం.. సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోవడంతో ముంబై జట్టు కూడా అతన్ని రంజీ టీమ్ నుంచి తప్పించింది.
టీమిండియాను ఏలాల్సినోడు..
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో మళ్లీ ముంబై జట్టులోకి రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా ఆకట్టుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. దాంతో ఫ్రాంచైజీలు పృథ్వీ షాను తీసుకునేందుకు ఆసక్తి చూపించలేదు. ప్లేయర్లు తక్కువగా ఉన్న ఫ్రాంచైజీలు కరుణించి తీసుకోవడమో.. లేక గాయపడ్డ ఆటగాళ్ల ప్లేస్లో రిప్లేస్మెంట్ అవుతనో తప్పా పృథ్వీ షా ఐపీఎల్ 2025 ఆడేందుకు ఆస్కారం లేదు.
భారత్ క్రికెట్ను ఏలాల్సినోడు ఇలా అన్సోల్డ్గా నిలవడం అభిమానులను బాధిస్తోంది. సెహ్వాగ్ తరహాలో ఫియర్లెస్ గేమ్ ఆడే పృథ్వీ షా ఆటకు చాలా మంది అభిమానులు ఉన్నారు. పృథ్వీ షా మరో వినోద్ కాంబ్లీలా తయారయ్యాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.
అతని సారథ్యంలో ఆడిన శుభ్మన్ గిల్ టీమిండియా కెప్టెన్సీ రేసులో ఉండగా.. అర్ష్దీప్ సింగ్ స్టార్ పేసర్ అయ్యాడు. రియాన్ పరాగ్, అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లు ఆడుతున్నారు. వీళ్లందరి కంటే ముందే భారత జట్టు తరఫున అవకాశాలు అందుకున్న పృథ్వీ షా మాత్రం అన్సోల్డ్గా నిలిచిపోయాడు.